ప్రభుత్వాల అధీనంలో ఉన్న అనేక ప్రాచీన ఆలయాలు ఆలనాపాలనా లేక శిథిలావస్థకు చేరుతుండగా.. అక్కడ మాత్రం గ్రామస్థులే ఊళ్లోని చారిత్రక ఆలయాలను పునరుద్ధరించుకొని(Preservation of ancient temples) కాకతీయుల నాటి స్ఫూర్తిని చాటుతున్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరులోని సుమారు 900 ఏళ్ల కిందట కాకతీయుల కాలంలో నిర్మించిన పంచకూటాలయం 60 ఏళ్లుగా శిథిలావస్థలో ఉంది. దీనికి పూర్వవైభవం తేవాలని గ్రామస్థులు సంకల్పించి రూ. కోటికిపైగా చందాలు వేసుకొని ఏడాదిన్నర కిందట పునర్నిర్మాణం పనులు ప్రారంభించారు. తమిళనాడు నుంచి స్థపతిని తీసుకొచ్చి పూర్తిగా రాళ్లతోనే గుడిని తీర్చిదిద్దుతున్నారు. అతుకులకు కాకతీయుల పద్ధతిలోనే కరక్కాయ, తేనె మిశ్రమాలను డంగుసున్నంలో కలిపి వినియోగిస్తున్నారు. 90 శాతం పూర్తయిందని, త్వరలో ప్రతిష్ఠాపన చేస్తామని ఆలయ కమిటీ ఛైర్మన్ బుచ్చిరెడ్డి తెలిపారు.
శ్రమదానం చేసి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలోని త్రికూటేశ్వరాలయం శిథిలావస్థకు చేరింది. ఆరు నెలల క్రితం గ్రామానికి చెందిన 30 మంది యువకులు శ్రమదానంతో ఆలయాన్ని శుభ్రం చేసి భక్తుల సందర్శనకు వీలుగా సొంత నిధులతో మరమ్మతు చేసి ఘనంగా ప్రారంభోత్సవం చేశారు.
ఖమ్మం జిల్లా కూసుమంచిలోని రామలింగేశ్వరాలయాన్ని గ్రామస్థులు బాగు చేశారు. ఈ ఆలయ చరిత్రపై చరిత్రకారుడు కట్టా శ్రీనివాస్ పుస్తకం రాయడంతో మరికొన్ని నిధులు సమకూరాయి.
వరంగల్ సమీపంలోని ఐనవోలు మండలం పంథిని గ్రామ పరిధిలో 1200 ఏళ్ల నాటి శివాలయం శిథిలమవగా గ్రామ ప్రజలు విరాళాలతో బాగు చేసుకున్నారు. 2018లో మళ్లీ ప్రతిష్ఠాపన జరిగింది.