కరోనా కష్టాల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ఉద్దీపన ప్యాకేజీ ఉమ్మడి వరంగల్ జిల్లాకూ లబ్ధి కలిగించనుంది. ఇక్కడి కుటీర, మధ్య, భారీ పరిశ్రమలన్నీ కలిపితే మూడు వేలకుపైగానే ఉంటాయి. పత్తి జిన్నింగ్, రైస్ మిల్లులు, గ్రానైట్ క్వారీలు, ఆయిల్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డెయిరీ, కోళ్ల ఫారాలు, వివిధ రకాల ఉత్పత్తుల కేంద్రాల్లో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. తాజా ప్యాకేజీ వల్ల ఇవి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపులు ఏడాది వరకు వాయిదా వేసుకొనే వెసులుబాటు కలిగింది. ఫలితంగా వాటి వద్ద నగదు లభ్యత పెరిగే అవకాశం ఉంది. సంవత్సరం వరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేయవచ్చు. ఈ వెసులుబాట్ల వల్ల ఓరుగల్లులోని పరిశ్రమలకు దాదాపు రూ. 1500 కోట్లకుపైగా లబ్ధి చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పరోక్షంగా ఉపాధి
వరంగల్ నగరం సమీపంలోని మడికొండలో వస్త్ర ఉత్పత్తి యూనిట్లు 364కు పైగా ఏర్పాటవుతున్నాయి. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు పదివేల మంది ఉపాధి పొందనున్నారు. ప్రభుత్వం వరంగల్ రూరల్ జిల్లాలో కాకతీయ మెగా జౌళి పార్కును నెలకొల్పుతుంది. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు దక్షిణ కొరియా కంపెనీలు ముందుకొచ్చాయి. ఇలా పరిశ్రమలకు కల్పించిన ప్రోత్సాహకాలతో మేలు కలగనుంది.