వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరులో జరిగిన సమావేశంలో అధికారుల తీరుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాలు అలాగే ఉన్నాయని... జిల్లా పరిస్థితి ఏం బాగోలేదని వ్యాఖ్యానించారు. మంత్రి పర్యటన ఉన్నప్పటికీ కలెక్టర్ హరిత హాజరుకాకపోవడం గమనార్హం. కలెక్టర్తో పాటు ఆర్డీవో సంపత్ రావు, ఎంపీడీవో నర్మద, మిషన్ భగీరథ అధికారులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మేము పదిరోజుల నుంచి చెప్తున్నాం. అయినా ఏం చర్యలు తీసుకోలేదు. ఎక్కడి చెత్త కుప్పలు అక్కడే ఉన్నాయి. రికార్డులు సరిగా లేవు. కలెక్టర్, అధికారులు అందరూ అలాగే ఉన్నారు. ఉపాధి హామీ పథకాన్ని సరిగా ఉపయోగించడం లేదు. గ్రామ పంచాయతీ నిధులు అలాగే ఉన్నాయి. ఖాతాలో దాదాపు రూ.లక్ష ఉన్నాయి. పంచాయతీకి ఉన్న అప్పులు ఎక్కడివి? గ్రామ పంచాయతీ డబ్బులు అవసరానికి వాడుకోవాలి కదా. అభివృద్ధి కోసం ఉపాధి హామీ పథకంలో లేబర్ను సరైన దిశలో బాగా ఉపయోగించుకోవచ్చు. నేను రెగ్యులర్గా వస్తుంటా. ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోను. అధికారులెవరైనా కఠిన చర్యలు ఉంటాయి.