తెలంగాణ

telangana

ETV Bharat / state

వరుణుడి కోసం పత్తి రైతు పడిగాపులు

వరుణుడు కరుణించక.. బావుల్లో నీరు లేక.. పత్తి రైతు పరిస్థితి దయనీయంగా మారింది. విత్తనాలు వేయాలో లేదో తెలియక.. వేసిన పంట ఎలా కాపాడాలో పాలుపోక.. ఎండిపోతున్న మొక్కలను చూడలేక కన్నీటిపర్యంతమవుతున్నాడు. పరిస్థితి ఇలానే కొనసాగితే పెట్టుబడి వచ్చే అవకాశమే లేదని వాపోతున్నారు రైతన్నలు.

By

Published : Jul 19, 2019, 12:36 AM IST

వరుణుడి కోసం పత్తి రైతు పడిగాపులు

వరుణుడి కోసం పత్తి రైతు పడిగాపులు

ఒకవైపు వరుణుడి రాక.. మరోపక్క భానుడి ధాటికి తట్టుకోలేక ఎండిపోతోన్న పత్తి పంటను చూస్తున్న రైతు పరిస్థితి వర్ణనాతీతం. జూలై గడిచిపోతున్న వర్షాలు కురవకపోవడం వందలాది ఎకరాల్లో పత్తి పంట ఎండిపోతోంది.

వరంగల్​ గ్రామీణ జిల్లాలో 70 నుంచి 80 వేల హెక్టార్లలో పత్తి పంటను సాగుచేస్తుంటారు. గతేడాది గులాబీ పురుగు వల్ల పత్తి దిగుబడి తగ్గిపోగా.. ఈసారి అసలు విత్తనాలు వేసేందుకు కాలం కలిసిరావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబడి సంగతి దేవుడెరుగు.. కనీసం పెట్టుబడైనా వస్తుందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మొక్కలు ఎండిపోవడం, ఉన్నా.. పెరగకపోవడం, వర్షం ఎప్పుడోస్తుందో తెలియకపోవడం పత్తి రైతును కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

జిల్లాలో 15 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. అన్ని కలిసి వస్తే ఇప్పటికే బారెడు పెరగాల్సిన మొక్కలు.. ఇంకా జానెడు కూడా దాటలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ఉన్న కొంచెం నీటి వనరులను వినియోగించుకుని పంటను కాపాడుకుందామంటే భానుడి ప్రకోపానికి అది కూడా ఆవిరైపోతోంది.

ప్రతి రోజు వరుణుడోస్తాడేమో అని వేచిచూస్తొన్న రైతుకు భానుడే ఎదురవుతున్నాడు. అలా నిరాశ రాత్రులనే గడుపుతున్నాడు రైతన్న. పరిస్థితి ఇలానే ఉంటే సాధారణం కన్నా 15 నుంచి 20 వేల హెక్టార్ల మేర పత్తి సాగు తగ్గే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: ఈ కల్పన ఇంట్లో నీటి కరవు లేనే లేదు

ABOUT THE AUTHOR

...view details