Son became a lawyer to get justice for his mother story: తల్లిదండ్రులు 30 ఏళ్ల క్రితం విడిపోయారు. అప్పుడు ఆ అబ్బాయికి లోక జ్ఞానం కూడా తెలువదు. ఏది మంచో ఏది చెడో తెలియని వయస్సు.. కానీ ఆ కుమారుడు అప్పటి నుంచే తన తల్లి బాధను అర్థం చేసుకుని ఏలాగైనా ఆమెకు న్యాయం చేయాలనే లక్ష్యాన్ని తన మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఇంటర్ చదువుతున్న వయస్సులోనే ఆయన తన తల్లికి న్యాయం కోసం అనేకమార్లు ఆమెతో పాటు న్యాయస్థానం చుట్టూ తిరిగారు. అయినా ఫలితం దక్కలేదు. అలాగని నిరాశకు గురై పోరాటం ఆపలేదు. చివరకు తన తల్లి కేసును స్వయంగా తానే వాదించి ఆమె మొహంలో చిరునవ్వులు నింపాడు. తన కుమారుడి విజయగాథ గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..
'నా పేరు సులోచన. నాకు 1971లో పెళ్లి అయ్యింది. 1992లో విడిపోయాం. ముప్పై సంవత్సరాల నుంచి మధ్యలో కేసు పెట్టినా కూడా గెలవలేదు. ఇప్పుడు నా కుమారుడే స్వయంగా నా కేసు వాదించి గెలవడం సంతోషంగా ఉంది. పిల్లలను చదివించడానికి మా అమ్మవాళ్లు సహాయం చేశారు. ఎట్లైనా తండ్రి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలన్న కుమారుడి లక్ష్యం నెరవేరింది అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.'-సులోచన, లాయర్ తల్లి
ఒక ఐదు దశాబ్దాలు వెనక్కి వెళితే 1971లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన సులోచనకు అదే వరంగల్ నగరంలో నివాసం ఉంటున్న పాము సోమయ్యకు వివాహం జరిగింది. వీరికి శరత్బాబు, రాజా రవికిరణ్ ఇద్దరు కుమారులు కలరు. తరువాత భార్యభర్తలు మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ ఘర్షణ మొత్తాన్ని పెద్ద కుమారుడైన శరత్బాబు గమనిస్తూనే ఉండేవాడు. ఈ దంపతులు ఇద్దరు చివరకు 1992లో కలిసి ఉండడం కన్నా విడిపోవడమే మేలు అని భావించి విడాకులు తీసుకున్నారు. సులోచన తన ఇద్దరి కుమారులతో తన పుట్టింటికి వెళ్లి, తన కుమారులను పెద్దవారిని చేసింది.