తెలంగాణ

telangana

By

Published : Apr 11, 2019, 11:25 PM IST

ETV Bharat / state

ఉమ్మడి పాలమూరులో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికల సమరంలో మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు పార్లమెంట్​ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించి కొంతసేపు పోలింగ్ ఆగిపోయింది. పలు గ్రామాల్లో తమ సమస్యలు పట్టించుకోలేదని ప్రజలు పోలింగ్ బహిష్కరించారు.

ముగిసిన మొదటి విడత పోలింగ్

ఈవీఎంల మొరాయింపులు, బహిష్కరణల నడుమ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా చోట్ల సాంకేతిక కారణాలతో ఈవీఎంలు మొరాయించాయి. ఈ కారణంగా అరగంట నుంచి గంటపాటు పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఓటేసిన ప్రముఖులు...

ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి వనపర్తి జిల్లాలో, ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ మహబూబ్​నగర్​లో ఓటేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్​లో, మాజీ మంత్రి, మహబూబ్​నగర్ పార్లమెంట్​ అభ్యర్థి డీకే అరుణ గద్వాలలో, నాగర్​కర్నూల్ లోక్​సభ అభ్యర్థి రాములు అచ్చంపేటలో ఓటు వేశారు. మల్కాజిగిరి అభ్యర్థి రేవంత్​రెడ్డి కొండారెడ్డిపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రతినిధులు, ఆయా జిల్లాల కలెక్టర్లు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు.

ముగిసిన మొదటి విడత పోలింగ్

విషాదం నుంచి తేరుకోని తీలేరు..

నారాయణపేట జిల్లా తీలేరు గ్రామస్థులు ఓటింగ్​కు దూరంగా ఉన్నారు. బుధవారం రోజు 10 మంది కూలీలు మరణించిన ఘటన నుంచి వారు ఇంకా తేరుకోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు.

మేము ఎందుకు ఓటేయాలి?

మహబూబ్​నగర్ జిల్లా ఉదండాపూర్​లో జలాశయ నిర్వాసితులు తమను పట్టించుకోలేదని పోలింగ్​కు దూరంగా ఉన్నారు. అదే జిల్లాలోని బూరెడ్డిపల్లి​లో తమ గ్రామాన్ని బాదేపల్లి మున్సిపాలిటీలో కలపడాన్ని నిరసిస్తూ.. ఓటింగ్​ను అడ్డుకున్నారు. ఆమనగల్ మండలంలోని ఆకుతోటపల్లి గ్రామాన్ని పంచాయతీగా గుర్తించనందుకు నిరసనగా ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. వడ్డేపల్లి జక్కిరెడ్డిపల్లి గ్రామంలో ఓట్లు గల్లంతయ్యాయని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఓట్ల లెక్క తేలే వరకు పోలింగ్ జరగనివ్వమని అడ్డుకున్నారు.
ఈవీఎంల మొరాయింపు..!
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఈవీఎం మొరాయించాయి. గంటల పాటు ఓటర్లు క్యూలో నిలబడాల్సి వచ్చింది. వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ప్రత్యేక ఏర్పాట్లు..

వేసవి దృష్ట్యా అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులు వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు కల్పించారు. ఆటోలు, ఇతర వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు.

పటిష్ఠ బందోబస్తు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, అధికారులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలను గుర్తించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం వల్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

ABOUT THE AUTHOR

...view details