తెలంగాణ

telangana

By

Published : Jul 29, 2020, 11:11 AM IST

ETV Bharat / state

కరోనా కాలంలోనూ రక్తప్రదాయినిగా వనపర్తి జిల్లా

కరోనా కాలంలోనూ వనపర్తి జిల్లాలో రక్తం దొరకక అవస్థలు పడే సమస్యలు తలెత్తలేదు. రెడ్​క్రాస్​ సంస్థ ఆధ్వర్యంలో లాక్​డౌన్​లోనే 13 శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించారు. జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో రక్తనిల్వల కొరత ఉండడం వల్ల వనపర్తి జిల్లా నుంచే సరఫరా చేశారు.

blood donations in wanaparthy district during corona period
కరోనా కాలంలోనూ రక్తప్రదాయినిగా వనపర్తి జిల్లా

కరోనా కాలంలోనూ వనపర్తి జిల్లా మాత్రం రక్త ప్రదాయినిగా మారింది.. రక్తం దొరకక అవస్థలు పడ్డారనే సమస్యే తలెత్తలేదు. మార్చిలో లాక్‌డౌన్‌ విధించింది మొదలు రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో నాలుగు నెలల్లో 13 శిబిరాలు నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన రక్తాన్ని సేకరించారు.. అవసరమైన వారికి అందించారు..

వనపర్తి జిల్లా ఆసుపత్రిలో రెడ్‌క్రాస్‌, వైద్యవిధాన పరిషత్తు సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతున్న రక్తనిధి కేంద్రం ఉంది. రక్తయూనిట్ల అవసరం ఎవరికున్నా ఈ కేంద్రాన్ని ఆశ్రయించాల్సిందే. ఎ పాజిటివ్‌, బి పాజిటివ్‌, ఒ పాజిటివ్‌ నిల్వలు ఎప్పటికప్పుడు కేంద్రానికి సమకూరుతున్నా.. ఏబీ పాజిటివ్‌, ఏబీ నెగటివ్‌, ఎ నెగటివ్‌, బి నెగటివ్‌, ఒ నెగటివ్‌ గ్రూప్‌ల నిల్వలు తక్కువగా సమకూరుతుంటాయి. జిల్లాలో ప్రతి నెలా సగటున 200 యూనిట్ల రక్తం అవసరం ఉంటుందనేది అంచనా.

కరోనా ప్రభావం ఉన్నా శిబిరాలు :

మార్చిలో కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. సరిగ్గా ఆ సమయంలో రక్తనిల్వల కొరత ఏర్పడింది. రెడ్‌క్రాస్‌ సంస్థ సభ్యులు వాట్సాప్‌ ద్వారా రక్తదాతలకు సందేశాలు పంపించి నిల్వలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా ప్రభావం ఉన్నా జిల్లా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రం ఆధ్వర్యంలో నాలుగు నెలల్లో 13 రక్తదాన శిబిరాలు నిర్వహించి 757 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రక్తనిధి కేంద్రం నిర్వాహకులు, రెడ్‌క్రాస్‌ సంస్థ సభ్యులు పక్కా ప్రణాళికతో నిల్వలను సమకూర్చేందుకు అక్టోబర్‌ వరకు శిబిరాలను నిర్వహించనున్నారు.

ఇతర జిల్లాలకూ ఇక్కడి నుంచే సరఫరా :

మహమ్మారి విజృంభణ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఏప్రిల్‌లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదయ్యాయి. దానితో పాటు రక్తనిల్వల కొరత ఏర్పడింది. జోగులాంబ గద్వాలతో పాటు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రక్త యూనిట్ల కొరతను అధిగమించేందుకు రక్తనిధి కేంద్రం నిర్వాహకులు చొరవ తీసుకున్నారు. ఆ రెండు జిల్లాలకు రక్తం యూనిట్లను అందజేశారు.

రక్తం యూనిట్లు తగ్గకుండా చూస్తున్నాం :

- ఖాజాకుతుబుద్దీన్‌, రెడ్‌క్రాస్‌ సంస్థ జిల్లా ఛైర్మన్‌, వనపర్తి

రక్తం దొరకక ఎవరూ ప్రాణాపాయ స్థితికి చేరకూడదని జాగ్రత్తపడ్డాం. రక్తదాన అవగాహకుల ద్వారా స్వచ్ఛ రక్తదాతలను ఇక్కడికి పిలిపించి రక్తం సేకరిస్తున్నాం. నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు రక్తం అవసరమున్న వారు రక్తదానం చేయడం లేదా మరొకరితో చేయించడం ద్వారా రక్తాన్ని సేకరిస్తున్నార. దాతలు సైతం సామాజిక బాధ్యతగా వ్యవహరించి రక్తదానం చేస్తున్నారు. అక్టోబరు వరకు వివిధ చోట్ల శిబిరాలు నిర్వహించనున్నాం.

ఇవీ చూడండి: అందుకే వెంటనే ప్లాస్మాను దానం చేశాను!

ABOUT THE AUTHOR

...view details