తెలంగాణ

telangana

'కాలీగ్రఫీ' కళలో రాణిస్తున్న వనపర్తి కుర్రాడు నవకాంత్

By

Published : Nov 13, 2020, 5:17 AM IST

అక్షరాలను పదాలుగా, పదాలను పేరాలుగా, పేరాలను పేజీలుగా మలచి, తాను చెప్పాలి అనుకున్నది చెప్తాడు రచయిత. కెమెరా క్లిక్‌మనిపించి, తనభావాన్ని బయట పెడతాడు ఫొటో గ్రాఫర్. కుంచెతో కుస్తీపడి, ఆహా అనిపిస్తాడు చిత్రకారుడు. భావాలను చెప్పేందుకు ఈ 3 కళలూ వేదికలే. అక్షరం, చిత్రం కలిసి, ఓ అద్భుతం ఆవిష్కృతమైతే.. చిత్రానికి అందం, ఆకర్షణా, భావం అక్షరమే అయితే.. అది కాలీగ్రఫీ. ఇదో అరుదైన కళ. అలాంటి కాలీగ్రఫీలో రాణిస్తున్నాడు వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన నవకాంత్.

'కాలీగ్రఫీ' కళలో రాణిస్తున్న వనపర్తి కుర్రాడు నవకాంత్
'కాలీగ్రఫీ' కళలో రాణిస్తున్న వనపర్తి కుర్రాడు నవకాంత్

'కాలీగ్రఫీ' కళలో రాణిస్తున్న వనపర్తి కుర్రాడు నవకాంత్

అందరి చేతిరాతా ఒకేలా ఉండదు. ఏ భాషలోనైనాసరే అక్షరాల్ని అచ్చం ఒకేలా రాసేవారు ఉండరనే చెప్పొచ్చు. రాతలో ఒక్కొక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. సినిమాలు, పుస్తకాల టైటిళ్లు, పత్రికలు, సంస్థల పేర్లు.. వాటిని రాసే అక్షరశైలిని బట్టే ఆకట్టుకుంటాయి. అలా.. అవే అక్షరాల్ని విభిన్న రూపాల్లో అందంగా, ఆకర్షణీయంగా రాయడమే క్యాలిగ్రఫీ. ఇప్పుడైతే కంప్యూటర్లు, ఫోన్లలో వివిధ ఫాంట్‌లు అందుబాటులో ఉన్నాయి గానీ.. అవి లేకముందు పుస్తకాల్లోని అక్షరాలను అందంగా రాసేందుకు కాలీగ్రఫర్స్​ ఉండేవాళ్లు.

గ్రాఫిక్స్, యానిమేషన్స్ వచ్చాక క్రమంగా క్యాలీగ్రాఫర్లకు ఆదరణ తగ్గిపోయింది. ప్రస్తుతం ఫైన్ ఆర్ట్స్‌లో కాలీగ్రఫీ ఓ సబ్జెక్టుగా ఉంది. చిత్రకారులకు ఉన్న గుర్తింపు క్యాలిగ్రాఫర్లకు దక్కక పోవడం.. ఈ కళపై ఆసక్తి చూపించేవారి సంఖ్య తగ్గేందుకు ఓ కారణంగా కనిపిస్తోంది. వివిధ భాషల్లో ఎంతో పేరు సంపాదించుకున్న కాలీగ్రాఫర్స్‌ ఉన్నా.. తెలుగు అక్షరాలు అందంగా కూర్చే వారిని వేళ్లపై లెక్కపెట్టవచ్చు. వారిలో ఒకరు వనపర్తి జిల్లా ఆత్మకూరు వాసి నవకాంత్ కదిరె.

పాఠశాల స్థాయి నుంచే నవకాంత్‌ది అందమైన చేతిరాత. తోటి విద్యార్ధుల పుస్తకాలపై వారి పేర్లు, వివరాలు ఎంతో అందంగా రాసిచ్చేవాడు. తను రాసే ప్రతిపేరూ దేనికదే భిన్నంగా, సుందరంగానూ ఉండేది. ఆ ప్రత్యేకత వల్లే గుర్తింపు తెచ్చుకున్న ఆ యువకుడు కాలీగ్రఫీపై మరింత దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఆ కళనే వృత్తిగా మలచుకున్నాడు.

ముంబయి, కొల్హాపూర్, నెదర్లాండ్స్, దక్షిణకొరియా సహా పలుదేశాల్లో నవకాంత్ ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. దేశంలోని అన్ని భాషల కాలీగ్రాఫర్స్‌తో జనగణమన గేయాన్ని రూపొందించిన అక్షరభారత్ కార్యక్రమానికి తెలుగు నుంచి నవకాంత్ ప్రాతినిథ్యం వహించాడు. కాలీగ్రఫీ పెయింటింగ్స్‌తో పుస్తకం రూపొందించి గూగుల్ ప్లే బుక్స్‌లో చోటు పొందాడు.

తెలుగులో కాలీగ్రఫీని బతికించడం, తెలుగు అక్షరాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేయడమే లక్ష్యమని చెబుతున్నాడు నవకాంత్. కాలీగ్రఫీపై ఆసక్తి ఉంటే భవిష్యత్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నాడు. సినిమా, గ్రాఫిక్స్, యానిమేషన్స్, గేమింగ్ లాంటి తెలుగు అక్షరాలతో సంబంధం ఉన్న ఏ రంగంలోనైనా కాలీగ్రాఫర్లకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాడు.

ఓ థీమ్‌ ఎంచుకుని, అక్షరాలతో పెయిటింగ్ వేస్తాడు నవకాంత్. తాను చెప్పాలనుకున్నది అక్షరాల కూర్పుతోనే చెప్పేస్తాడు. రంగు, ఆకృతి, పరిమాణంలో వైవిధ్యం జోడించి, అద్భుతమైన భావాలు పలికిస్తాడు నవకాంత్. ఇప్పటివరకూ అక్షరాలతో తీర్చిదిద్దిన కళాఖండాలు ఆయనకు ఎంతో పేరు సంపాదించిపెట్టాయి.

ఇదీ చదవండి:ముఖ్యమంత్రి కేసీఆర్​తో అసదుద్దీన్​ భేటీ

ABOUT THE AUTHOR

...view details