వికారాబాద్ జిల్లాలో మొత్తం 103 మత్స్యకార సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో నాలుగు వేల మందికి వరకు సభ్యులు ఉన్నారు. జల వనరుల శాఖ ఆధ్వర్యంలో మొత్తం 1,207 చెరువులున్నాయి. వాటిలో 499 మాత్రమే చేప పిల్లల పెంపకానికి అనువైనవని అధికారులు గుర్తించారు.
కోట్పల్లి, జుంటుపల్లి, సర్పన్పల్లి తదితర పది సాగునీటి ప్రాజెక్టుల్లోనూ వదలవచ్చని నిర్ణయించారు. చెరువు లేదా సాగు నీటి ప్రాజెక్టు సామర్ధ్యంలో కనీసం 30 శాతం నీరు ఉంటేనే చేప పిల్లల్ని విడిచిపెట్టడానికి వీలుంటుంది. ఈ ప్రకారం కోట్పల్లి ప్రాజెక్టులో సుమారు 10 లక్షల పెద్ద సైజు చేప పిల్లల్ని వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
సైజుల వారీగా...
మొత్తంగా ప్రాజెక్టుల్లో 80 నుంచి 100 మిల్లీమీటర్ల పొడవైనవి 21 లక్షలు, చెరువుల్లో 40 నుంచి 70 మిల్లీమీటర్ల పొడవైనవి 90 లక్షలు వదలవచ్చని మత్స్యశాఖాధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 2 లక్షలకుపైగా చేప పిల్లల్ని సిద్ధం చేసే యూనిట్ అందుబాటులో ఉంది. మిగిలిన 1.08 కోట్ల చేప పిల్లల్ని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొనుగోలు చేయనున్నారు.