పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆదివారం జరిగిన పోలింగ్లో వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ ఛైర్మన్ తాటికొండ స్వప్న తన తోటి కోడలు పేరుతో ఓటు వేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన 283 పోలింగ్ కేంద్రంలో ఆమె ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో కలిసి ఓటు వేశారు. ఓటరు జాబితాలో తన పేరు లేకున్నా ఓటు వేశారని కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రఘునందన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె వ్యవహారంపై జిల్లా కలెక్టర్తో పాటు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొన్నారు.
నా పేరు మీదే ఓటు వేశా: తాటికొండ స్వప్న
నా పేరు మీదే ఓటు వేశానని.. ఇదివరకే ఓటరు జాబితాలో తన పేరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నానని అధ్యక్షురాలు తాటికొండ స్వప్న తెలిపారు. ఆధార్ కార్డుతో ఓటు వేయడానికి వెళ్లానని అక్కడ అధికారులు అన్ని చూశాకే తనకు ఓటు వేయడానికి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఇతర పార్టీల ఏజెంట్లు కూడా ఎవరూ అభ్యంతరం చెప్పలేదని.. కాంగ్రెస్ నాయకులు తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఇతరుల ఓటు వేయాల్సిన అవసరం తనకు లేదని ఆమె పేర్కొన్నారు.
ఎవరూ అభ్యంతరం చెప్పలేదు: ప్రిసైడింగ్ అధికారి
ఏజెంట్లు ఎవరు అభ్యంతరం చెప్పక పోవడంతో ఆమెకు ఓటు వేయడానికి అవకాశం ఇచ్చామని ప్రిసైడింగ్ అధికారి వినయ్ కుమార్ తెలిపారు. ఛైర్పర్సన్ ఓటు వివాదం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.