తెలంగాణ

telangana

కారుజోరు: హుజూర్​నగర్ తోటలో గులాబీ వికాసం

By

Published : Oct 24, 2019, 2:27 PM IST

హుజూర్‌నగర్‌లో కారు పాగా వేసింది. ఉత్తమ్‌ సిట్టింగ్‌ స్థానాన్ని గులాబీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగుతుందనుకున్న ఉపఎన్నిక ఫలితాల్లో తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయదుందుబి మోగించారు. రాష్ట్రం ఆవిర్భవించాక ఏ ఎన్నికైనా.. ఉపఎన్నికైనా తమకు తిరుగులేదని తెరాస మరోసారి నిరూపించుకుంది.

కారుజోరు: హుజూర్​నగర్ తోటలో గులాబీ వికాసం

విజయోత్సవాల్లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి

శాసనసభ ఎన్నికల్లో తెరాస తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది. ఆ తర్వాత సాధారణ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థుల సంఖ్య కొంతమేర తగ్గినా ప్రజల ఆదరణ పొందింది. సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగించింది. ఎన్నిక ఏదైనా తమదే విజయం అనేంతగా గులాబీ దళం దూసుకెళ్తోంది. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి నినాదమే గెలుపు మంత్రంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక తెరాసకు సవాల్‌ విసిరింది. కాంగ్రెస్‌ పార్టీ సిట్టింగ్‌ స్థానం కావడం.. ఉత్తమ్‌ పద్మావతి తాజా మాజీ ఎమ్మెల్యే అవడంతో తెరాసకు గట్టిపోటీ ఇస్తుందని అంచనా వేశారు. వాటన్నింటినీ చిత్తుచేస్తూ కారు విజయదుందుబి మోగించింది.

కేటీఆర్.. అన్నీ తానై...

తెరాస కార్యనిర్వాహక బాధ్యతలు చేపట్టిన తర్వాత కేటీఆర్.. అన్ని బాధ్యతలు తనపైనే వేసుకుని పార్టీని ముందుకు నడుపుతున్నారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక విషయంలోనూ ఇదే జోరు కొనసాగించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతోపాటు ఓ బృందాన్ని నియమించారు. పూర్తి సమన్వయంతో పనిచేస్తూ కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలుకొట్టారు.

పురపోరు వేళ తెరాసలో నూతనోత్సాహం..

ఎన్నికకు రెండు రోజుల ముందు ముఖ్యమంత్రి బహిరంగ సభ వర్షం కారణంగా రద్దైంది. దీన్ని విపక్షాలు తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశాయి. సభకు కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే రాలేదని కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉపఎన్నిక ప్రచారంలో హోరెత్తించారు. ఈ ఆరోపణలను గులాబీ నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టారు. సీఎం సభ రద్దైనా ఆయన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రకటించి అనుకున్నది సాధించారు. కేటీఆర్ రోడ్‌షోలు సైదిరెడ్డి విజయానికి బాటలు వేశాయి.. పురపాలక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ.. హజూర్‌నగర్‌ ఉపఎన్నిక గెలుపు తెరాస విశ్వాసం రెట్టింపు చేసింది.

హుజూర్​నగర్ తోటలో గులాబీ గుబాళించింది. సంవత్సరాలుగా 'ఉత్తమ్​'పై జరుగుతున్న పోరులో విజయం సాధించింది. ఉత్తమ్ పద్మావతిరెడ్డిపై శానంపూడి సైదిరెడ్డి విజయం హుజూర్​నగర్​లో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రతిష్ఠాత్మకమైన ఉప పోరులో కాంగ్రెస్​కు చివరికి రిక్త'హస్త'మే మిగిలింది.

ABOUT THE AUTHOR

...view details