రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, ఆదుకోవలసిన ప్రభుత్వమే వారిని విస్మరిస్తోందని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో తెజస ముఖ్యకార్యక్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నియంత్రిత సాగు పేరుతో ప్రభుత్వం.. రైతుల చేత బలవంతంగా సన్న వడ్లు, పత్తి సాగు చేయించి తరువాత తన బాధ్యతను విస్మరించిందని అన్నారు.
అందుకే తెలంగాణ వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొందని మండి పడ్డారు. రైతుల పట్ల కనీస కర్తవ్యం ప్రభుత్వం నిర్వర్తించలేకపోయిందని ఆరోపించారు. పంటవేసిన వెంటనే బీమా పథకం అమలు చేయాలి. కానీ రెండేళ్లుగా బీమా కంపెనీలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా మొన్న అధిక వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం లభించలేదని అన్నారు.
రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేక పోయిందని కోదండరాం విమర్శించారు. ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుండడంతో, రైతులు బయట మార్కెట్లో అమ్మకోవాలంటే రూ. 1,300 కంటె ఎక్కువ గిట్టుబాటు కావడంలేదని, పత్తి విషయంలో కూడ ఇలానే ఉందని అభిప్రాయపడ్డారు.