సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలంటూ దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. వీరికి భాజపా రాష్ట్ర నాయకుడు వేలంగి రాజు మద్దతు తెలిపారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టగా.. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, భాజపా నాయకులకు మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కోదాడ దళితులకు దళితబంధు రావాలంటే కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలని దళితులు డిమాండ్ చేశారు.
రాజీనామా ద్వారా ఉపఎన్నిక వస్తే ఈ ప్రాంత దళితులకు దళితబంధు వస్తుందని అన్నారు. దళితుల అభివృద్ధిపై కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని దళిత సంఘాల నాయకులు అన్నారు. కేసీఆర్కు హుజూరాబాద్ లో ఓటమి భయంతో మరో మారు దళితులను మోసం చేస్తున్నారని భాజపా రాష్ట్ర నాయకుడు ఓర్సు వేలంగి రాజు ఆరోపించారు. దళిత సంఘాలు ఆందోళన విరమించకపోవడంతో భాజపా నాయకులను, దళిత సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు.