తెలంగాణ

telangana

ETV Bharat / state

సక్సెస్ ఫార్ములా: సడలింపులిస్తూనే నియంత్రణ - corona cases in surapet

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడం వల్ల ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. నల్గొండ జిల్లాలో పదిరోజులుగా, సూర్యాపేట జిల్లాలో ఐదు రోజులుగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా రాలేదు. యాదాద్రి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాని విషయం తెలిసిందే.

corona cases are decreasing day by day in nalgonda district
సూర్యాపేట కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ చర్చలు

By

Published : Apr 28, 2020, 10:11 AM IST

భారీ సంఖ్యలో కరోనా కేసులతో ఒక్కసారిగా రాష్ట్రస్థాయి అధికారుల దృష్టి ఆకర్షించిన సూర్యాపేటలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఇది సత్ఫలితాన్ని ఇస్తుండటం వల్ల ఇదే ఒరవడి కొనసాగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తులు సైతం వేగంగా కోలుకుంటున్నారు.

సూర్యాపేట జిల్లాలో అత్యధిక కేసులు రావడంతో కట్టడికి ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారి సర్పరాజ్‌ అహ్మద్‌ను డిప్యూటేషన్‌పై జిల్లాకు పంపింది. ఆయన నేతృత్వంలో జిల్లా పాలనాధికారి వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌, ఇతర శాఖల అధికారులు బృందంగా ఏర్పడి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. కంటైన్‌మెంట్​ జోన్లలో ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేశారు. ప్రభావిత ప్రాంతాల పరిధి తగ్గించి పాజిటివ్‌ కేసు వ్యక్తి ఇంటి సమీపంలోని 200 మీటర్ల పరిధిని పూర్తిగా కట్టడి, తదితర చర్యలతో ఐదురోజులుగా కేసులు నమోదు కాలేదు. ఫలితంగా సూర్యాపేటకొంతమేర కుదుటపడింది.

మూడు కంటైన్‌మెంటు జొన్ల తొలగింపు

జిల్లాలో మూడు కంటైన్‌మెంట్​ జోన్లను తొలగిస్తున్నట్లు సూర్యాపేట కలెక్టరు, ఎస్పీ ప్రకటించారు. వారిద్దరూ పట్టణంలో తొలి వైరస్‌ ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. ఇంటింటి సర్వే తీరును పరిశీలించి విలేకర్లతో మాట్లాడారు. పట్టణంలోని కుడకుడ ప్రాంతంలోపాటు నేరేడుచర్ల, మఠంపల్లి ప్రాంతాలను ఫ్రీ జోన్లుగా మారుస్తున్నామని తెలిపారు. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలు కొనసాగుతాయని, ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.

జిల్లాలో కంటైన్‌మెంటు జోన్ల సంఖ్య తొమ్మిదికి తగ్గింది. జిల్లాలో తొలి పాజిటివ్‌ వ్యక్తికి నయం కాగా నాలుగు రోజుల కిందటే గాంధీ ఆస్పత్రి వైద్యులు జిల్లాకు పంపారు. ఇతనితోపాటు మరో ఐదుగురికి కూడా నయం కావడం వల్ల డిశ్ఛార్జి చేశారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.

మరో ఆరుగురి ఐసోలేషను గడువు ముగియగా సోమవారం మొదటి నమూనాలు తీసుకున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. రెండు, మూడు రోజుల్లో నాగారం మండలానికి చెందిన మరో ఇద్దరు డిశ్ఛార్జి అయ్యే అవకాశముందని చెప్పారు. మైనారిటీ పాఠశాల క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్న 16 మందిని సోమవారం ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలోని ఐసోలేషను వార్డుకు తరలించారు.

నేటి నుంచి హోల్‌సేల్‌ దుకాణాలు

కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల కొన్ని చోట్ల మినహాయింపులు ఇచ్చేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు నిత్యావసర సరకులు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట కూరగాయల మార్కెట్‌ పరిధిలోని హోల్‌సేల్‌ దుకాణాలను పట్టణం వెలుపలికి తరలించారు. ఇవి నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.

కాలనీలు, వీధుల్లోని కిరాణా దుకాణాలను ఆంక్షలతో నడిపేందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేలా పోలీసు, మున్సిపల్‌ శాఖలు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయి. సడలింపులు ఇచ్చిన సమయంలో గుంపులుగా ప్రజలు బయటకు రాకుండా పోలీసులు గస్తీ కాస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణదారులపై కేసులు నమోదు చేస్తారు. అనవసరంగా ప్రజలు బయటకు వస్తే క్వారంటైన్‌కు తరలించాలని నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details