చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్బాబు కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కర్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. మంత్రులు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్లతో కలిసి స్వయంగా సూర్యాపేటలోని ఇంటికి వెళ్లిన కేసీఆర్... ముందుగా సంతోష్బాబు చిత్రపటానికి పూలువేసి అంజలి ఘటించారు. అనంతరం భార్య సంతోషి, తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను ఓదార్చారు. పిల్లలు, అభిజ్ఞ, అనిరుధ్ తేజలనూ పలకరించారు.
వీరుడికి వందనం..
దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందన్న కేసీఆర్... ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని కోరారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డికి సూచించారు.
రూ. 5 కోట్ల చెక్కు అందజేత
సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్-1 ఉద్యోగ నియామక పత్రం, హైదరాబాద్ బంజారాహిల్స్లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాలను అందించారు. సంతోష్ భార్యకు రూ. 4 కోట్లు, తల్లిదండ్రులకు కోటి రూపాయల చెక్కులను అందించారు. కోటి రూపాయలను మనవరాలు అభిజ్ఞ పేరుపై డిపాజిట్ చేయాలని నానమ్మ- తాతయ్య కోరారు.
అండగా ఉంటాం..