సిద్దిపేట జిల్లాలో పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యం పెంపు పనుల పరిశీలనకు చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తాజాగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. చెన్నై లేదా హైదరాబాద్లోని కేంద్ర పర్యావరణ ప్రాంతీయ శాఖ, గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలవనరుల సంఘానికి చెందిన సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సెప్టెంబరు 30లోగా నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంపై మధ్యంతర నివేదిక ఇవ్వాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలిపింది.
పిటిషనర్ తరఫు వాదనలు
ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా గౌరవెల్లి రిజర్వాయరు సామర్థ్యాన్ని పెంచుతూ పనులు చేపట్టడాన్ని సవాలు చేస్తూ గౌరవెల్లికి చెందిన బి.రాజిరెడ్డి, మరో నలుగురు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జ్యుడీషియల్ సభ్యులు జస్టిస్ కె.రామకృష్ణన్, సాంకేతిక సభ్యులు డాక్టర్ కె.సత్యగోపాల్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున కె.శ్రవణ్కుమార్ వాదనలు వినిపించారు. 2003లో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్-2 కాకతీయ కాలువ విస్తరణకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసిందని చెప్పారు. దీని ద్వారా అదనంగా 1.781 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించాలన్నది లక్ష్యమని వెల్లడించారు.