తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister Harish Rao: వరికి బదులు పత్తి, కంది సాగు చేయండి: హరీశ్​రావు - తెలంగాణ మంత్రి హరీశ్​రావు తాజా వార్తలు

ఈ వర్షాకాలంలో రైతులను వరికి బదులు పత్తి, కంది పంటల వైపు మళ్లించాలని అధికారులను మంత్రి హరీశ్​రావు ఆదేశించారు. వరి వేసిన రైతులు.. వెదజల్లే పద్ధతి పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. సాగులో సేంద్రీయ ఎరువులే వాడాలని, వాటితో అధిక దిగుబడి వస్తుందని హరీశ్​రావు తెలిపారు.

minister harish rao conducted teleconference on agriculture with officials and political party leaders
వరికి బదులు పత్తి, కంది సాగు చేయండి: హరీశ్ రావు

By

Published : Jun 1, 2021, 5:58 PM IST

ఈ వర్షాకాలంలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు రైతులకు సూచించారు. వరికి బదులుగా ప్రత్తి, కంది పంటలు వేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పండించే పత్తి పంటకు అంతర్జాతీయ మార్కెట్​లో మంచి డిమాండ్ ఉందని, మంచి ధర పలికే అవకాశముందని హరీశ్​ రావు తెలిపారు. గతేడాది కంది పంట క్వింటాలుకు 6 వేల నుంచి 7 వేల రూపాలయలు ధర పలికిందని... ఈఏటా పప్పు దినుసులకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశముందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించి... రైతులు ఈ పంటలవైపే మొగ్గు చూపే విధంగా చేయాలని మంత్రి సూచించారు.

వెదజల్లే పద్ధతితో ఎన్నో లాభాలు

ఈ వానకాలానికి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి హరీశ్​రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వానకాల సాగు సమాయత్త ఏర్పాట్లపై చర్చించారు. వరి పండించే రైతులు నారు పద్ధతి కాకుండా వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేయాలని హరీశ్​రావు సూచించారు. ఈ విధానంలో 6 నుంచి 7 వేల రూపాయల ఖర్చు ఆదా అవుతుందన్నారు. అదేవిధంగా విత్తన మోతాదు 10-12 కేజీల సరిపోతాయన్నారు. ఖర్చు ఆదా అవడమే కాకుండా కూలీల కొరతా తీరుతుందని, పంట 10 నుంచి 15 రోజుల ముందుగానే కోతకు వస్తుందని తెలిపారు. దిగుబడి 10 నుంచి 15 శాతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న వెదజల్లే పద్ధతిపై వ్యవసాయ శాఖ అధికారులు, రైతు బంధు సమితి అధ్యక్షులు, సభ్యులు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

సేంద్రీయ ఎరువులే మంచివి

రాష్ట్ర ప్రభుత్వం 65 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు జీలుగ, జనుము విత్తనాలను అందజేస్తుందని తెలిపారు. పచ్చిరొట్ట వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బన పదార్థాలు పెరిగి.. చౌడు సమస్య తీరి పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయంపై రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. సిద్దిపేట జిల్లాలోని నేలల్లో అధిక మోతాదులో పాస్పరస్ ఉండటం వల్ల పంట దిగుబడి తగ్గుతోందని హరీశ్​రావు అన్నారు. బాస్వరాన్ని మొక్కకు అందేలా పాస్పో బ్యాక్టీరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు.

సేకరించిన ధాన్యం నిల్వ కోసం గోదాముల నిర్మాణానికి ఆసక్తిగల సంస్థలు, వ్యక్తుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని మంత్రి కలెక్టర్​కు సూచించారు. వర్షాకాలానికి సంబంధించి ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చదవండి :Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ

ABOUT THE AUTHOR

...view details