తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రారంభానికి 'కొండపోచమ్మ' సిద్ధం..

గోదావరి జలాలను ఒడిసి పట్టేందుకు కొండపోచమ్మ జలాశయం ముస్తాబైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఓ మణిహారం లాంటి కొండపోచమ్మ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 29న లాంఛనంగా ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చివరి జలాశయం కావడం వల్ల ప్రారంభోత్సవాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

By

Published : May 28, 2020, 6:55 PM IST

Updated : May 28, 2020, 11:01 PM IST

kondapochamma reservior opening on friday by cm kcr
ప్రారంభానికి 'కొండపోచమ్మ' సిద్ధం.. ప్రత్యేక పూజలు

మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీలో సముద్ర మట్టానికి 88మీటర్ల ఎత్తున ఉన్న గోదావరి జలాలను వివిధ దశల్లో ఎత్తిపోతల ద్వారా 618 మీటర్ల ఎత్తులో గల కొండపోచమ్మ రిజర్వాయర్​కు చేర్చుతున్నారు. అత్యధిక ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి గ్రావిటీ ద్వారానే ఇతర ప్రాంతాలకు గోదావారి జలాలు చేరుతాయి. 15 టీఎంసీల సామర్థ్యం గల ఈ రిజర్వాయర్​కు కొండపోచమ్మ పేరు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. ఉమ్మడి మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దులో కొండపోచమ్మ దేవాలయం, దానికి సమీపంలోని కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయాలకు ఎంతో ప్రశస్తి ఉంది. ఈ పుణ్యక్షేత్రాల పేరుమీదనే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించే అతి పెద్ద రిజర్వాయర్​కు మల్లన్నసాగర్ అని, అత్యధిక ఎత్తులో నిర్మించే రిజర్వాయర్​కు కొండపోచమ్మ సాగర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నామకరణం చేశారు.

ఈ ప్రాజెక్టును ఓ దేవాలయంగా భావిస్తున్న కేసీఆర్, అందుకు అనుగుణంగానే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. చండీయాగం, సుదర్శన యాగం, గంగమ్మ పూజలు తదితర కార్యక్రమాలను కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నారు. కొండ పోచమ్మ దేవాలయంలో శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో చండీయాగం, పంపుహౌజ్ వద్ద శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో సుదర్శన యాగం చేయనున్నారు. ఉదయం 4 గంటలకే యాగాలు ప్రారంభం కానున్నాయి.

ఈ నెల 29న ఉదయం ఏడున్నరకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కొండపోచమ్మ దేవాలయానికి చేరుకుంటారు. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం మర్కూక్ పంపు హౌజు వద్దకు చేరుకుంటారు. పది గంటల సమయంలో చినజీయర్ స్వామితో కలిసి సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం పంపుహౌజ్ స్విచ్‌ ఆన్‌ చేస్తారు. అక్కడి నుంచి ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్ వద్దకు చేరుకుని గోదావరి జలాలకు స్వాగతం పలుకుతారు. అనంతరం గంగా పూజ నిర్వహిస్తారు.

కరోనా నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతి కొద్దిమంది వీఐపీలను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. మర్కూక్ పంపు హౌజ్ వద్దకు 42మందికి, డెలివరీ కెనాల్ వద్దకు కేవలం 20మందిని మాత్రమే అనుమతించనున్నారు.

ఇదీ చూడండి:మిడతల దండుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

Last Updated : May 28, 2020, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details