సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్లోని కొండపోచమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా సోమవారం ప్రారంభమయ్యాయి. కల్పవల్లిగా పిలుచుకొనే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది.
భక్తులు కొత్తకుండలో నైవేద్యం తయారుచేసి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించుకున్నారు. మంగళవారం రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3నెలల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.