సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడకల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల రోజులుగా తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆందోళన చేస్తున్నారు. రైతుల వద్ద నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు పడిగాపులు - సంగారెడ్డి జిల్లా తడ్కల్ రైతుల ఆందోళన
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా తడ్కల్ రైతులు. ఓ వైపు తుపాను హెచ్చరికలు.. మరోవైపు కొనుగోళ్లలో జాప్యం తమను ఆందోళనకి గురిచేస్తోందని వాపోతున్నారు.
![చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు పడిగాపులు thadkal farmers problems](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:41:44:1621753904-tg-srd-36-23-raitula-andolana-ts10055mp4-23052021123926-2305f-1621753766-381.jpg)
కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యం తీసుకుని వచ్చినప్పటికీ... అధికారులెవరూ పట్టించుకోవడం లేదన్నారు. తుపాను హెచ్చరికలు రావడంతో మరింత భయపడాల్సి వస్తోందని వాపోతున్నారు. వర్షాలు వస్తే... ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా నీటిపాలవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. లారీల కొరత కారణంగా కొన్ని రోజులు ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆపామని... ప్రస్తుతం కొనుగోళ్లు జరుగుతున్నాయని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారి తెలిపారు.
ఇదీ చదవండి :మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం.. కనిపించని భౌతికదూరం