తెలంగాణ

telangana

ETV Bharat / state

వలసబాటలో తల్లిదండ్రులు.. చదువుకు దూరంగా చిన్నారులు

Migration effect on children education: పేదరికం ఆ చిన్నారుల చదువుకు ఆటంకంగా మారుతోంది. పొట్టకూటి కోసం తల్లిదండ్రులు పనిబాట పట్టడంతో... పాఠాలు నేర్వాల్సిన పిల్లలు వారితో వలసబాట పట్టాల్సివస్తోంది. దీంతో అప్పటివరకు నేర్చిన పాఠాలు మర్చిపోయి... ప్రాథమిక స్థాయిలో పట్టు సాధించలేక చివరకు చదువుకు దూరమవుతున్నారు విద్యార్థులు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని వలస చదువులపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

By

Published : Jan 9, 2022, 8:13 PM IST

Migration effect on children
చదువుకు దూరంగా చిన్నారులు

వలసబాటలో తల్లిదండ్రులు.. చదువుకు దూరంగా చిన్నారులు

Migration effect on children education: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతం పేరు చెప్పగానే.. వలసలు గుర్తుకువస్తాయి. ఏటా డిసెంబర్, జనవరి నెలల్లో ఇక్కడి నుంచి గిరిజనులు చెరుకు నరికేందుకు సంగారెడ్డి, ఆంధోల్‌ జహీరాబాద్ నియోజకవర్గాల్లోని గ్రామాలకు వెళ్తారు. తోటల పక్కనే తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటుచేసుకొని.. మార్చి నెల వరకు అక్కడే ఉండి పనులు చేసుకుంటారు. ఊళ్లో పిల్లలను చూసుకోవడానికి ఎవరూ లేక బడి మానిపించి వాళ్లనూ తమతో తీసుకెళ్తారు. దీంతో ఖేడ్ ప్రాంతంలో సర్కారీ బడుల్లోని విద్యార్థుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోతోంది.

సిర్గాపూర్ మండలం రూప్ల తండా ప్రాథమిక పాఠశాల. ఇక్కడి నుంచి 8 మంది పిల్లలు కుటుంబంతో కలిసి వలస వెళ్లారు. వాళ్లు తిరిగి మార్చిలో వెనక్కి వస్తారు. ఈలోగా అంతకు ముందు నేర్చుకున్న పాఠాలు మర్చిపోతారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డిసెంబరు, జనవరి రాగానే ఇక్కడి పేదలు.. పనుల కోసం వేరే ప్రాంతాలకు వలసవెళ్తారు. దీంతో వారి పిల్లలు కూడా తల్లిదండ్రుల వెంబడి వెళ్లాల్సి వస్తోంది. మళ్లీ మార్చిలో వస్తారు. ఈ క్రమంలో ఈ 5 నెలల్లో నేర్చుకున్నది మొత్తం వారు మరిచిపోతున్నారు. అష్రఫ్ అలీ, ఉపాధ్యాయుడు, రూప్లతండా

సగం మంది వలసబాట

ఇదొక్కటే కాదు.. సీతారాంతండా బడిలో 50 మంది పిల్లల్లో వలస వెళ్లిన వారు పోగా.. 25 మంది మాత్రమే వస్తున్నారు. కంగ్టి మండలంలోని రాంతీర్త్, చుక్కల్ తీర్త్, రాజారాం తండా, నాగల్గిద్ద మండలంలోని శాంతి నగర్ తండాల్లోని బడుల్లోనూ సగం మంది విద్యార్థులు వలస వెళ్లినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. సాధు శంకర్ తండాలో 26 మంది పిల్లలకు గానూ... తల్లిదండ్రులతో అందరూ వలసబాటపట్టడంతో ఏకంగా బడినే మూసేశారు. ఇక్కడ పని చేసే టీచర్‌ని వేరే చోటుకు పంపించారు.

స్కూల్లో మొత్తం 90 మంది విద్యార్థులు ఉన్నారు. తల్లిదండ్రులు చెరుకు పనుల కోసం వలస వెళ్లే క్రమంలో పిల్లలను కూడా తీసుకెళ్తున్నారు. దీంతో ఈ సమయంలో విద్యార్థుల సంఖ్య 50, 60 మాత్రమే ఉంటోంది. వలసల ప్రభావం పిల్లల చదువులపై తీవ్రంగా పడుతోంది. సరస్వతీ, ఉపాధ్యాయురాలు, రాజారాం తండా

చదువుపై ప్రభావం

ప్రాథమికతో పాటు ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులపైనా వలసల ప్రభావం పడుతోంది. కంగ్టి మండలం వాసర్ ఉన్నత పాఠశాలలో 160 మంది చదువుతున్నారు. ప్రస్తుతం 50 మంది వరకు వలసవెళ్లారు. ప్రతి తరగతిలోనూ కనీసం పది మంది వరకు బడికి రావడం లేదు. పదో తరగతి చదివే పిల్లలు కూడా అమ్మానానలతో పాటు చెరుకు నరికేందుకు వెళ్లడంతో వారి చదువుల మీద ప్రభావం చూపుతోంది.

తల్లిదండ్రులు పనుల కోసం వలస వెళ్లేటప్పుడు.. పిల్లలు ఒంటరిగా ఉంటున్నారు. వారి మంచీచెడులు చూసుకునేవాళ్లు, వండి పెట్టేవాళ్లు లేకపోవడంతో తప్పనిసరిగా వాళ్లను కూడా తీసుకువెళ్తున్నారు. ప్రతి తరగతి నుంచి 10 నుంచి 12 మంది పిల్లలు వలస వెళ్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వారి చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని కోరుకుంటున్నాం.

-అబ్దుల్ హమీద్, ప్రధానోపాధ్యాయులు, వాసర్

ప్రత్యామ్నాయం చూడాలి

తల్లిదండ్రుల వలసలతో చదువులకు దూరమవుతున్న పిల్లలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. కన్నవారితో కలిసి పిల్లలు వెళ్లకుండా వసతిగృహం తరహాలో ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. లేకుంటే అసలే వెనుకబడిన ఈ ప్రాంతంలో పిల్లలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది.

ఇదీ చదవండి:ఆరుతడి పంటల్లో అధిక దిగుబడులు లక్ష్యంగా.. విద్యార్థుల పరిశోధనలు

ABOUT THE AUTHOR

...view details