తెలంగాణ

telangana

ETV Bharat / state

హజ్రత్​ పీర్ గైబ్ సాహెబ్ ఉర్సు.. మత సామరస్యానికి వేదిక

సాధారణంగా ఉత్సవాల్లో విభిన్న ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న హజ్రత్​ పీర్ గైబ్ సాహెబ్ దర్గా ఉర్సులో వందల సంవత్సరాల నుంచి నిర్వహించే పశువుల మేళ, కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణ.

By

Published : Feb 22, 2021, 7:48 AM IST

Updated : Feb 22, 2021, 8:01 AM IST

animal expo in hajrath peer gaibe saheb ursu at nyalkal
హజ్రత్​ పీర్ గైబ్ సాహేబ్ ఉర్సు.. మత సామరస్యానికి వేదిక

తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న సంగారెడ్డి జిల్లా న్యాల్​కల్ వద్ద హజ్రత్ పీర్ గైబ్ సాహేబ్ దర్గా ఉంది. ఏటా ఫిబ్రవరిలో ఉర్సు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో నిర్వహించే రెండు కార్యక్రమాలకు దూర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు హాజరవుతారు. సుమారు 350 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న పశువుల మేళాకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ సమయంలో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండవు కాబట్టి... ఎద్దులు, ఆవులను తీసుకొని అన్నదాతలు ఇక్కడికి వస్తారు.

ఇక్కడి మేళాలో మేలైన పశుల అమ్మకం, కొనుగోళ్ల కోసం పొరుగు రాష్ట్రాల రైతులు కూడా వస్తారు. రానురానూ పశుపోషణకు ఆదరణ తగ్గుతున్నందున... రైతుల్లో తిరిగి ఆసక్తి పెంచేందుకు నిర్వాహకులు 16 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. వివిధ కేటగిరీల వారిగా పశువులను, రైతులను ఎంపిక చేసి వారికి బహుమతులు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.

కుస్తీ పోటీలు..

ఈ ఉత్సవాల్లో మరో ఆకర్షణ... కుస్తీ పోటీలు. అత్యంత పురాతనమైన ఈ క్రీడలో గ్రామీణ క్రీడాకారులు తమ ప్రతిభ చాటేందుకు ఈ ఉర్సు వేదికగా నిలుస్తోంది. ఏడు వందల మంది క్రీడాకారులు తమ సత్తా నిరూపించుకుంటున్నారు. ఈ పోటీల్లోనూ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తాదులు పాల్గొంటారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నిర్వాహకులు బహుమతులతో పాటు ఆర్థిక సాయం అందించి క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా సాగే ఈ ఉర్సు ఉత్సవం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

ఇదీ చూడండి:సమగ్ర భూసర్వే కోసం మార్గాలు అన్వేషిస్తున్న సర్కారు

Last Updated : Feb 22, 2021, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details