తెలంగాణ

telangana

By

Published : May 8, 2023, 7:41 PM IST

ETV Bharat / state

Congress Youth Declaration : 'ఐదు శీర్షికలుగా కాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్'

Revanth Announced Congress Youth Declaration : తెలంగాణ ఉద్యమంలో 60 ఏళ్లు పోరాడినా ఆకాంక్షలు నెరవేరలేదని రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. ఓయూ, కాకతీయ వర్సిటీలు కేవలం విశ్వవిద్యాలయాలు కావని.. ఆత్మగౌరవ ప్రతీకలని అన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటిన వేదికలని ఆయన స్పష్టం చేశారు.

Revanth Reddy
Revanth Reddy

Revanth Announced Congress Youth Declaration : ఐదు శీర్షికల ద్వారా కాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్​ను ప్రకటిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ​రెడ్డి పేర్కొన్నారు. అమరవీరుల ఉద్యమ కారులకు గుర్తుగా తొలి డిక్లరేషన్​ అని తెలిపారు. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. వారి కుటుంబాలకు రూ.25,000 పింఛన్​తో పాటు.. అమరవీరులకు సముచిత గుర్తింపు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని వివరించారు. రంగారెడ్డి జిల్లా సరూర్​నగర్​లో నిర్వహించిన కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పోస్టులతో పాటు.. ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఏటా జూన్‌ 2న జాబ్‌ క్యాలెండర్​ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 17న నియామక పత్రాలు లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.4,000.. నిరుద్యోగ భృతి ఇస్తామని రేవంత్​ రెడ్డి వెల్లడించారు.

సెంట్రలైజ్డ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని రేవంత్ ​రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రాగానే కమిషన్​ను బలోపేతం చేస్తామని తెలిపారు. యూపీఎస్సీ మాదిరిగా చేసి పారదర్శకంగా పోస్టుల భర్తీ చేస్తామని వివరించారు. సెంట్రలైజ్డ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానం తీసుకువస్తామని చెప్పారు. ఏడు జోన్లలో ఎంప్లాయ్‌మెంట్‌, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణం: ప్రైవేట్ పరిశ్రమల్లో 75 శాతం స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తెస్తామని పేర్కొన్నారు. విద్య, ఉపాధి సమస్యలపై యూత్‌ కమిషన్‌ ఏర్పాటు చేయనుట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గల్ఫ్‌ కార్మికులను ఆదుకునేందుకు చట్టం తీసుకు వస్తామని అన్నారు. మోసం చేసే ఏజెంట్లను నియంత్రిస్తామని.. గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాలను ప్రత్యేక సంస్థ ద్వారా భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, పాత బకాయిలను చెల్లిస్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్‌, మెదక్‌, ఖమ్మంలో వర్సిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. బాసర వర్సిటీ తరహాలో 4 ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటుతో పాటు.. స్పోర్ట్స్‌ అకాడమీని ఏర్పాటు చేసి గ్రామీణ యువతకు చేయూత అందించనున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే పోలీసులు, ఆర్టీసీ కార్మికుల పిల్లలకు వరంగల్‌, హైదరాబాద్‌లో 2 వర్సిటీలను నిర్మిస్తామని చెప్పారు. వారికి ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని వెల్లడించారు. యువ మహిళా సాధికారత కోసం ఎలక్ట్రిక్‌ స్కూటీలు ఉచితంగా ఇస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

"తెలంగాణ ఉద్యమంలో 60 ఏళ్లు పోరాడినా ఆకాంక్షలు నెరవేరలేదు. ఓయూ, కాకతీయ వర్సిటీలు కేవలం విశ్వవిద్యాలయాలు కావు. ఓయూ, కాకతీయ వర్సిటీలు ఆత్మగౌరవ ప్రతీకలు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటిన వేదికలు. వర్సిటీలు తెలంగాణ పౌరుషానికి వేదికలుగా నిలిచాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల సంఖ్య 12.5 లక్షలు. విభజన వేళ తెలంగాణకు 5.3 లక్షలు కేటాయించారు. తొలి ఏడాది 1.07 లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని కేసీఆర్‌ మాటిచ్చారు. కమిటీ నివేదిక ప్రకారం 1.9 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 2.5 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయి. 9 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ పోస్టులు భర్తీ చేయట్లేదు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్‌ అండగా నిలుస్తోంది." -రేవంత్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

అయిదు శీర్షికలుగా కాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్

ఇవీ చదవండి:Telangana Inter results in Tomorrow : తెలంగాణలో రేపే ఇంటర్ ఫలితాల విడుదల

కర్ణాటకలో ముగిసిన ప్రచార పర్వం.. కన్నడ ఓటర్ల మన్ననలు ఎవరికో?

ABOUT THE AUTHOR

...view details