తెలంగాణ

telangana

ETV Bharat / state

Casino Effect : రూ.92 లక్షల భూ పరిహారం.. క్యాసినో పాలు - Casino on cellphone

young man lost 92 lakhs due to casino: ఆన్​లైన్​లో గేమ్స్​కు అలవాటు పడ్డ ఆ యువకుడు చేసిన ఓ పనికి వారి కుటుంబమే రోడ్డున పడింది. భూసేకరణ కింద ప్రభుత్వం ఇచ్చిన రూ.92 లక్షలు పరిహారం క్యాసినో ఆడి పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో చేటుచేసుకుంది.

casino
casino

By

Published : Dec 21, 2022, 11:45 AM IST

young man lost 92 lakhs due to casino: సెల్‌ఫోన్‌లో క్యాసినో ఆడే కుర్రాడి నిర్వాకం ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. భూసేకరణ కింద ప్రభుత్వం ఇచ్చిన పరిహారం రూ.92 లక్షలు పోగొట్టాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన చన్‌వళ్లి శ్రీనివాస్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వ్యవసాయమే వారికి జీవనాధారం. పెద్ద కుమారుడు శ్రీపాల్‌రెడ్డి నగరంలో బీటెక్‌ చదువుతున్నాడు. చిన్న కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి (19) నిజాం కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.

శ్రీనివాస్‌రెడ్డికి గ్రామంలో 10 ఎకరాల భూమి ఉంది. ఇటీవల ప్రభుత్వం టీఎస్‌ఐఐసీకి ఆ భూములను అప్పగించింది. భూసేకరణ కింద ఎకరాకు రూ.10.5లక్షలు చొప్పున పరిహారం ఇచ్చింది. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి దాదాపు రూ.1.05 కోట్లు వచ్చింది. ఈ సొమ్ముతో శ్రీనివాస్‌రెడ్డి శంషాబాద్‌ మండలం మల్లాపూర్‌ వద్ద అర ఎకరా భూమిని కొనుగోలు చేసేందుకు రూ.70 లక్షలకు ఒకరితో బేరం కుదుర్చుకున్నారు. అడ్వాన్సుగా రూ.20 లక్షలు చెల్లించారు.

మిగతా రూ.85 లక్షలను తండ్రి శ్రీనివాస్‌రెడ్డి, తల్లి విజయలక్ష్మి బ్యాంకు ఖాతాల్లో రూ.42.5 లక్షల చొప్పున జమచేశారు. అప్పటికే ఫోన్లో కింగ్‌ 567 క్యాసినో పేరుతో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతున్న హర్షవర్ధన్‌రెడ్డి.. పరిహారంగా వచ్చిన డబ్బు విషయం తెలుసుకున్నాడు. కొత్తగా కొనుగోలు చేసిన భూమికి సంబంధించి యజమానికి డబ్బు ఇస్తానంటూ.. హర్షవర్ధన్‌ తన తండ్రి ఖాతాలోని రూ.42.5 లక్షల్ని తన బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు.తల్లి దగ్గరా ఇదే విషయాన్ని చెప్పడంతో ఆమె బ్యాంకు ఖాతాలోని రూ.42.5 లక్షలను విత్‌డ్రా చేయించి ఇంట్లో ఉంచింది.

హర్షవర్ధన్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతూ తన ఖాతాలోని రూ.42.5 లక్షలను దఫదఫాలుగా పోగొట్టుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత ఇంట్లో ఉంచిన సొమ్మును తన అకౌంట్‌లో పలుమార్లు డిపాజిట్‌ చేసుకుని ఆటలో కోల్పోయాడు. డబ్బు గురించి అడగ్గా.. ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడి పోగొట్టినట్లు ఇంట్లో వాళ్లకు తెలిపాడు. అతడు గ్రామంలోని మరొకరి వద్ద రూ.7 లక్షలు అప్పు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు నుంచి మొత్తం రూ.92 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకునే కుమారుడు ఇలా చేసినట్లు తెలుస్తోంది.

ఇది చదవండి:

ABOUT THE AUTHOR

...view details