తెలంగాణ

telangana

ETV Bharat / state

Land acquisition: భారీగా పెరిగిన భూముల విలువలు.. పారిశ్రామిక ప్రాజెక్టులపై ప్రభావం

Land acquisition: ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ సంస్థల సమూహంగా రంగారెడ్డి జిల్లాలో 19 వేల ఎకరాల్లో ఔషధనగరిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 14 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములు. మరో అయిదువేల ఎకరాలను సేకరించాల్సి రాగా దశల వారీగా అధికారులు నాలుగు వేలు సేకరించారు. చివరి దశకు వచ్చేసరికి మిగిలిన వెయ్యి ఎకరాలకు ధరలు అయిదురెట్లు పెరిగాయి.

By

Published : Mar 28, 2022, 4:01 AM IST

Updated : Mar 28, 2022, 4:07 AM IST

Land acquisition
భారీగా పెరిగిన భూముల విలువలు

Land acquisition: రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిపాదించిన పలు పారిశ్రామిక ప్రాజెక్టుల వద్ద ధరలు భారీగా పెరగడంతో భూసేకరణ కష్టసాధ్యంగా మారుతోంది. ప్రత్యామ్నాయ స్థలాల వైపు ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కొన్ని ప్రాజెక్టుల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం 1.57 లక్షల ఎకరాలతో భూబ్యాంకును ఏర్పాటు చేసింది. ఇవన్నీ ప్రభుత్వ భూములే. పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొచ్చే సంస్థలకు వీటిని ప్రభుత్వం కేటాయిస్తోంది. వీటితో పాటు కొత్తగా వచ్చే పరిశ్రమల కోసం, పారిశ్రామిక నడవాల కోసం అదనంగా భూసేకరణ అనివార్యమవుతోంది.

నడవాలపై ప్రభావం:రాష్ట్రంలో హైదరాబాద్‌-వరంగల్‌; హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ పారిశ్రామిక నడవాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. రెండు మార్గాల్లో పదేసి వేల ఎకరాలలో వీటిని స్థాపించాలనుకుంది. అందులో మూడొంతుల భూములు ప్రభుత్వానివి కాగా...మిగతావి సేకరించేందుకు సన్నాహాలు చేపట్టింది. జాతీయ రహదారికి ఆనుకొని ఉండే భూములు అవసరం కాగా... దాని కోసం అన్వేషణ చేపట్టింది. అధికారులు ఎక్కడికి వెళ్లినా భారీగా ధరలు చెప్పడంతో టీఎస్‌ఐఐసీ అధికారులు కొనుగోలుకు వెనుకాడుతున్నారు. వీటికి తోడు హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌- బెంగళూరు పారిశ్రామిక నడవాలను ప్రభుత్వం కొత్తగా కేటాయించింది. ఆరు వేల ఎకరాల చొప్పున భూములను రెండు మార్గాల్లో సేకరించాల్సి ఉంది. ఈ మార్గాల్లో భారీ డిమాండు దృష్ట్యా భూసేకరణపై అధికారులు ఆందోళనలో ఉన్నారు. జహీరాబాద్‌ నిమ్జ్‌లో తొలుత భూములకు తక్కువ ధర ఉండేది. ఏటేటా ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు భూసేకరణ వ్యయం రెట్టింపు అయింది.

డ్రై పోర్టు ఏర్పాటులో జాప్యం:రాష్ట్రానికి బహుళవిధ లాజిస్టిక్స్‌ పార్కు(డ్రై పోర్టు)ను కేంద్రం మంజూరు చేసింది. దీనికి వెంటనే భూసేరణ చేయాలని సూచించింది. ప్రభుత్వం నల్గొండ జిల్లాలోని ఒక మండలంలో భూసేకరణ చేయాలని భావించింది. అక్కడ ధర పెరగడంతో సేకరణలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం దాన్ని మరో చోటుకు తరలించాలని యోచిస్తోంది. ఇవి గాక మరో 12 పారిశ్రామిక ప్రాజెక్టుల వద్ద ఇదే పరిస్థితి ఏర్పడింది.

నెలకొల్పే సంస్థలకే సేకరణ బాధ్యతలు:రాష్ట్రానికి కొత్తగా వచ్చే సంస్థలు తమకు విమానాశ్రయం, జాతీయ రహదారులు, రైల్వేలైన్ల సమీపంలో భూములు కావాలని కోరుతున్నాయి. అక్కడ కొత్తగా సేకరించాల్సి ఉన్నందున ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం చూపిస్తోంది. కొన్ని సంస్థలు అంగీకరించినా మిగిలిన సంస్థలు తమకు అవే భూములు కావాలంటున్నాయి. తాము భూముల సేకరణకు పూనుకుంటే యజమానులు భారీగా ధరలను డిమాండు చేస్తున్నారని, అలాగాకుండా ఆయా సంస్థలే నేరుగా రంగంలోకి దిగాలని టీఎస్‌ఐఐసీ సూచిస్తోంది. దానికి అవసరమైన సాయం అందిస్తామని చెబుతోంది.

ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం:పరిశ్రమలకు అవసరమైన భూములకు యజమానులు తమకు నచ్చిన ధరను డిమాండు చేస్తున్నారని టీఎస్‌ఐఐసీ వర్గాలు తెలిపాయి. వాటి ధరలతో పాటు సహాయ పునరావాసం వంటివి సమస్యాత్మకంగా మారుతున్నాయని వివరించాయి. ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని ఆ వర్గాలు తెలియజేశాయి.

  • ఇదీ చూడండి:

YADADRI UDGHATAN: నేడే యాదాద్రి ఆలయ ఉద్ఘాటన.. ఆరేళ్ల తర్వాత స్వయంభువుల దర్శనం

Last Updated : Mar 28, 2022, 4:07 AM IST

ABOUT THE AUTHOR

...view details