హైదరాబాద్ శంషాబాద్ మండలం పెద్దషాపూర్ తండాలో బెంగళూరు జాతీయ రహదారి పక్కన సర్వే నం.220లో 110.23 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 60 ఎకరాలను మాజీ సైనికాధికారులకు కేటాయించగా మిగిలిన 50 ఎకరాలను స్థానిక రైతులకు ప్రభుత్వం అసైన్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కొందరు రైతులు విక్రయించుకోవడంతో 16 ఏళ్ల క్రితం 32 ఎకరాలను పీవోటీ కింద ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇందులోంచి 2006లో 6.2 ఎకరాలను ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించారు. కొంత భాగం ఇళ్లు నిర్మించుకోగా మిగతాది ఖాళీగా ఉంది. మరో 19 ఎకరాల్లో స్థానిక ఎస్సీ, ఎస్టీ రైతులు సాగు చేసుకుంటున్నారు. ఎకరా స్థలాన్ని ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. ఇంకా ఆరు ఎకరాలు ఖాళీగా ఉంది.
కుటుంబసభ్యుల పేరిట పత్రాల తయారీ
ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిన భూమితోపాటు మిగిలిన పడావుగా ఉన్న భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. పెద్దషాపూర్ మాజీ సర్పంచి భూదందాకు తెరలేపాడు. తన భార్య, కుమారుడు, కుమార్తె, కోడలు పేరిట భూములకు హక్కు ఉన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించాడు. ఇళ్ల నిర్మాణ అనుమతులు ఇచ్చే అధికారం తనకు లేకున్నా ఉన్నట్లుగా నకిలీ పత్రాలతో నమ్మబలికి .. తర్వాత కాగితాలపై ప్లాటు ఉన్నట్లుగా చూపించి ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేవాడు. ప్లాటు విస్తీర్ణం బట్టి రూ.1.20లక్షల నుంచి రూ.2.40లక్షల ధర ఉండేది. అతని పదవీకాలం 9 ఏళ్ల క్రితమే ముగిసినా ఇప్పటికీ భూమి కేటాయిస్తున్నట్లుగా పత్రాలు సృష్టించి, ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నాడు. సుమారు 300 మందికి బురిడీ కొట్టించాడు. జాతీయరహదారి పక్కన తక్కువ ధరకే వస్తుందన్న ఆశతో కొందరు కొనుగోలు చేసి మోసపోతున్నారు. మాజీ సర్పంచి అక్రమాలకు బిల్కలెక్టర్ సహకరిస్తున్నాడు. నకిలీ పత్రాలపై పేర్లు రాయడం, స్టాంపులు వేయడంలో అతనే కీలకమని తెలుస్తోంది.
నిషేధిత జాబితాలో భూములు