తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2021, 5:35 PM IST

ETV Bharat / state

'రైతుల సమస్యలు తీర్చకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం'

రైతులు పండించిన ధాన్యంను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అమలులో విఫలమైందని విమర్శించారు. షాద్ నగర్ మార్కెట్ యార్డ్​లోని ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆయన సందర్శించారు. రైతుల సమస్యలు తీర్చకుంటే ఆందళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

shadnagar market yard
'రైతుల సమస్యలు తీర్చకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం'

ప్రతి గింజ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీని నెరవేర్చడంలో విఫలమైందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆరోపించారు. భాజపా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు షాద్ నగర్ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంను భాజపా నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.

మార్కెట్ యార్డ్​లోని ధాన్యంను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. 15 రోజుల క్రితం ధాన్యం బస్తాలను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చామని… ఇప్పటికీ తమ ధాన్యంను కొనుగోలు చేయలేదని పలువురు రైతులు వాపోయారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడిసిపోయిందని, తడిసిన ధాన్యం కొనుగోలు చేయడానికి నిర్వాహకులు ఆసక్తి చూపడం లేదని వివరించారు. ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి ధాత్రితో ఫోన్​లో మాట్లాడారు. గన్ని బ్యాగుల సమస్యతోపాటు యార్డుకు వచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆమెను కోరారు.

వర్షాలు పడి ధాన్యం తడుస్తున్నా ప్రభుత్వం స్పందించకుండా ఉండటం బాధాకరమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా షాద్​ నగర్ కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు 9 నుంచి 10 కిలోలు తరుగు తీయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కష్టపడి పండించిన పంటను దోచుకోవడం మంచిది కాదని, అలాంటి ప్రభుత్వాలకు మనుగడ ఉండదని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో భాజపా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో భాజపా తెలంగాణ విమోచన కమిటీ ఛైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్, పాపయ్య గౌడ్, సుదర్శన్ రెడ్డి, భూపాల చారి, మహేందర్ రెడ్డి, ఇ.కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నరసింహ గౌడ్, వెంకటేష్, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


ఇదీ చూడండి: Eatala: వారం రోజుల్లో దిల్లీ వెళ్లి భాజపాలో చేరుతా: ఈటల

ABOUT THE AUTHOR

...view details