తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడ రాజ‌న్న స‌న్నిధిలో మ‌హిళ‌ల ఉచిత సేవ‌

Womens Doing Free Service in Vemulawada Temple: మ‌హిళ‌ల‌కు సాధార‌ణంగా భ‌క్తి భావం ఎక్కువ. ఆయా పండుగ‌లు, ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో గుళ్లు, గోపురాలు, పుణ్య‌క్షేత్రాల‌కు వెళుతుంటారు. కానీ వీరికి ఇంకాస్త ఎక్కువే ఉంది. ఎంత‌లా అంటే.. వేములవాడ ఆల‌యంలో ఉచితంగా సేవ‌లు చేసేంత‌గా..

By

Published : Mar 18, 2023, 7:45 PM IST

Vemulawada Rajarajeshwara Temple, sircilla
Women Free Service

Womens Doing Free Service in Vemulawada Temple: భ‌క్తి ఎక్కువ‌గా ఉన్న మ‌హిళ‌లు మ‌హా అయితే ఏం చేస్తారు... పండ‌గ‌లు, ప‌బ్బాల‌ప్పుడు ఆల‌యాల‌కు వెళుతుంటారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇత‌ర ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో గుడికి వెళ్లి త‌మ భ‌క్తిని చాటుకుంటారు. కానీ.. ఈ మ‌హిళ‌లు మాత్రం ఒక అడుగు ముందుకేసి అంత‌కంటే ఎక్కువే చేస్తున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజ‌న్న ఆల‌యంలో ఉచితంగా సేవ‌లు చేస్తున్నారు.

సిరిసిల్ల జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి అనేక మంది భ‌క్తులు త‌ర‌లి వ‌స్తుంటారు. ఇలా వ‌చ్చిన వారు ద‌ర్శనం అనంత‌రం కానుకలను నగదు, బంగారం, వెండి వస్తువుల రూపాల్లో హుండీల్లో వేస్తుంటారు. వీటిని ఆలయ అధికారులు 20 రోజులకు ఒక‌సారి, ఉత్సవాలు ముగిసిన సందర్భంలో అయితే 15 రోజులకొకసారి ఆదాయం లెక్కిస్తుంటారు. పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఈ లెక్కింపు కొనసాగుతుంది.

ఇలా హుండీ ఆదాయం లెక్కిపు నుంచి మొద‌లు కొని రద్దీ సమయాల్లో భ‌క్తుల‌ను క్యూలైన్లో స‌రిగ్గా నిలుచునేలా చూడ‌టం, లడ్డూ ప్రసాదాల ప్యాకింగ్‌, అన్నదానం చేయడం వ‌ర‌కు వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ త‌మ సేవా భావాన్ని చాటుతున్నారు. ప్రధానంగా రాజన్నకు వచ్చే కానుకలు నగదు లెక్కించేందుకు వ‌స్తున్నారు. రెండు రోజులు ముందు సమాచారం ఇస్తే చాలు.. వ‌చ్చి ఆ ప‌నిని పూర్తి చేసి వెళ‌తారు.

ఆలయం నుంచి హుండీలను లెక్కింపు కేంద్రానికి తరలించడం, డబ్బులు, చిల్లర నాణేలను వేరు చేసి లెక్కింపు లైన్లల్లో ఉన్నవారి వద్దకు తరలించడం వంటి పనులు చేస్తుంటారు. ఈ మ‌హిళ‌ల‌కు భోజన వసతి కల్పిస్తారు. సాయంత్రం లెక్కింపు ముగిసిన తరవాత స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్తుంటారు. ఈ లెక్కింపులో పాల్గొనడం తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని మహిళలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజన్న సన్నిధిలో సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామ‌ని సంతోషంగా చెబుతున్నారు.

ఆయా జిల్లాల నుంచి వ‌స్తున్నారు: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతో పాటు సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్‌, ఆసిఫాబాద్‌ తదితర జిల్లాల నుంచి రాజన్న సన్నిధిలో జరిగే హుండీ లెక్కింపులో శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి, శ్రీ రాజరాజేశ్వరస్వామి సేవా సమితి, సత్యసాయి సేవా సమితికి చెందిన మ‌హిళ‌లు భారీ సంఖ్య‌లో పాల్గొంటారు. తాజాగా హుండీల ఆదాయం లెక్కింపులో దాదాపు 500 మంది శివరామకృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొనగా ఇందులో 450 మంది మహిళలే కావడం గమనార్హం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details