తెలంగాణ

telangana

ETV Bharat / state

నిధుల కేటాయింపులో జాప్యం... నెమ్మదించిన రాజన్న ఆలయ అభివృద్ధి

ప్రజల ఇలవేల్పుగా విలసిల్లుతున్న వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి నెమ్మదించింది. సీఎం కేసీఆర్‌ ఆలయ అభివృద్ధికి ఏటా రూ. 100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించి ఐదేళ్లు గడిచినా... నిధుల కేటాయింపులో జాప్యం కొనసాగుతోంది. గతంలో రూ. 71 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం... ఆ నిధులను వీటీడీఏ ద్వారా ఖర్చు చేసేందుకు ఉత్వర్వుల జారీతో పాటు కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఆలయ అధికారులు రూ. 410 కోట్లతో భక్తుల సౌకర్యాల కోసం చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.

By

Published : Nov 4, 2020, 5:05 AM IST

నెమ్మదించిన రాజన్న ఆలయ అభివృద్ధి... నిధుల కేటాయింపులో జాప్యం
నెమ్మదించిన రాజన్న ఆలయ అభివృద్ధి... నిధుల కేటాయింపులో జాప్యం

నెమ్మదించిన రాజన్న ఆలయ అభివృద్ధి...

రాజన్న వేములవాడ ఆలయంలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించి ఐదేళ్లు గడిచినా... నిధుల విడుదలలో జాప్యం కొనసాగుతోంది. జూన్ 18, 2015న కేసీఆర్... స్వయంగా వేములవాడ ఆలయాన్ని సందర్శించి రాజన్న క్షేత్రం అభివృద్ధికి ఏటా రూ. 100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.

ఐదేళ్లు గడిచినా...

ఐదేళ్లు గడిచినా... ఆలయ అభివృద్ధి మాత్రం అంతంతమాత్రంగానే ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో యాదాద్రి క్షేత్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే... వేములవాడ రాజన్న ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ఎప్పుడు తీర్చిదిద్దుతారా అని భక్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ముందుకు సాగని భూసేకరణ...

రాజన్న గుడి చెరువు అభివృద్ధి, వసతి గదుల నిర్మాణం, సెంట్రల్ బస్టాండుల నిర్మాణం కోసం చేపట్టే భూసేకరణ పనులు ముందుకు సాగడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 121 ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు కేవలం 35 ఎకరాలు మాత్రమే సేకరించగలిగారు. వీటీడీఏకు ఇప్పటి వరకు రూ. 70 కోట్లు కేటాయించగా... అందులో నుంచి రూ. 50 కోట్లు భూసేకరణకు కేటాయించారు. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు ఆరేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయిందని స్థానికులు అంటున్నారు.

నిధులు కేటాయిస్తే...

ఆలయ అభివృద్ధికి సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామని వీటీడీఏ వైస్‌ ఛైర్మన్‌ పురుషోత్తంరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం రూ. 71 కోట్లు మంజూరు చేయగా... రూ. 51 కోట్లతో వివిధ పనులు చేపట్టినట్లు వివరించారు. మరో రూ. 20 కోట్లు కలెక్టర్ వద్దే ఉన్నాయని... త్వరలోనే వీటీడీఏ బృందం మరోసారి శృంగేరి వెళ్లి వచ్చిన తర్వాత అన్ని పూర్తవుతాయని వెల్లడించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే మిగతా పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:దుబ్బాకలో భాజపాదే విజయం: బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details