తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులకు పరీక్షా కాలం - online exams for students in sircilla

కరోనా ప్రభావంతో వాయిదా పడిన పదో తరగతి పరీక్షల పునఃప్రారంభానికి కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో త్వరలోనే పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ నిమగ్నమైంది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.

online exams for students during lock down in sircilla district
విద్యార్థులకు పరీక్షా కాలం

By

Published : May 16, 2020, 9:44 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో పది, డిగ్రీ, పాలిటెక్నిక్‌ విద్యార్థులు పరీక్షల షెడ్యూల్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇంటర్‌ మూల్యాంకనం ప్రారంభమైంది. మార్చి 19న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు హైకోర్టు ఆదేశాలతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. తెలుగు పేపర్‌-1, పేపర్‌-2, హిందీ పరీక్షలు పూర్తయ్యాయి. పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు వైరస్‌ బారిన పడకుండా తీసుకునే చర్యలు.. నిర్వహణ విధానంపై తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర విద్యాశాఖ హైకోర్టుకు నివేదించింది.

అదనపు పరీక్షా కేంద్రాలను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాల్లో 6,462 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రస్తుతం భౌతిక దూరం పాటించాలనే నిబంధనతో వీటి సంఖ్య 67కు చేరే అవకాశం ఉంది. పరీక్ష కేంద్రాల కోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత, కొన్ని ప్రైవేటు పాఠశాలలను గుర్తించారు.

డిగ్రీ పరీక్షలు ఏప్రిల్‌ చివరి వారంలో జరగాలి. లాక్‌డౌన్‌తో పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. జిల్లాలో 19 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 5,834 మంది విద్యార్థులున్నారు. సోమవారం ఉన్నత విద్యామండలి 2, 4, 6 సెమిస్టర్‌ పరీక్షలను జూన్‌ 20 తర్వాత నిర్వహించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష సమయాన్ని రెండు గంటలకు కుదించడంతో పాటు ప్రశ్నపత్రంలో ప్రతి విభాగంలోనూ చాయిస్‌గా ప్రశ్నలు ఇవ్వనున్నట్లు సమాచారం.

జిల్లాలోని పాలిటెక్న్‌క్‌ కళాశాలలో పరీక్షల నిర్వహణకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 6వ సెమిస్టర్‌ విద్యార్థులు మార్చి 21లోపు 90శాతం హాజరు ఉన్నవారు పరిశ్రమల శిక్షణకు అర్హులుగా పేర్కొంది. వీటి ఫలితాలను జూన్‌ 6న ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌లో సన్నద్ధత

జిల్లాలో పదో తరగతి విద్యార్థుల కోసం రోజువారీగా నమూనా పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ నెల 11 నుంచి 18 వరకు పాఠ్యాంశాల వారీగా ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు ఆన్‌లైన్‌లో (వాట్సాప్‌, జూమ్‌ యాప్‌) పంపుతున్నారు. దీని కోసం ప్రతి పాఠశాలలో పదో తరగతి విద్యార్థులను బృందంగా ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రం పంపుతున్నారు. విద్యార్థులు పరీక్ష రాశాక స్వతహాగా వారే మూల్యాంకనం చేసుకునేలా సాయంత్రం జవాబు పత్రాన్ని ఉంచుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details