తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: 'సహాయక చర్యల కోసం... సిరిసిల్లకు డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నాం' - మంత్రి కేటీఆర్

సిరిసిల్లలో పరిస్థితి దారుణంగా ఉందని... భారీ వర్షాలతో జిల్లా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు సహాయ చర్యల్లో పాల్గొనాలని కోరారు. చెరువులు, కుంటలు పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

KTR
మంత్రి కేటీఆర్

By

Published : Sep 7, 2021, 11:56 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సిరిసిల్ల పట్టణం దాదాపుగా వరద నీటితో నిండిపోయింది. రద్దీగా ఉండే పాతబస్టాండ్‌, వెంకంపేట, ప్రగతినగర్‌, పెద్దబజార్‌, కరీంనగర్‌ రోడ్డు, శాంతినగర్‌ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల ప్రధాన రహదారి సమీపంలో ఉన్న కొత్త చెరువు పూర్తిగా నిండి వరదనీరు రోడ్డుపైకి పారుతోంది. చెరువు సమీపంలో ఉన్న పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. భారీ వరదతో సిరిసిల్లలో జనజీవనం స్తంభించింది.

జలదిగ్భందంలో సిరిసిల్ల

స్పందించిన కేటీఆర్

సిరిసిల్ల పరిస్థితిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. భారీగా వరద వచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్​, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్​లతో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. భారీ వర్షాలతో సిరిసిల్ల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు చెరువులను గమనించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలనీ ఆదేశించారు. వరదలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. చెరువులు, కుంటలు పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేయాలని... స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు.

సహాయక చర్యల కోసం హైదరాబాద్​ నుంచి డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నామని మంత్రి వెల్లడించారు. వరద మళ్లింపునకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా సహాయక చర్యలు అందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. వరద నేపథ్యంలో సిరిసిల్లలో పాఠశాలలకు కలెక్టర్​ అనురాగ్ జయంతి సెలవు ప్రకటించారు. కంట్రోల్ రూమ్ నెంబరు 91000 69040 ను ఏర్పాటు చేశారు. అవసరమైతే ప్రజలు ఈ నెంబర్​కు ఫోన్​ చేయాలని సూచించారు.

ప్రమాదకరంగా బోనాల చెరువు.. భయాందోళనలో స్థానికులు

సిరిసిల్ల సమీపంలో ఉన్న బోనాల చెరువు ప్రమాదకరంగా మారింది. ఏ సమయంలోనైనా చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు కొత్త కలెక్టరేట్‌ చుట్టూ భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌ హెగ్డే ఆధ్వర్యంలో సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి:Rain Effect in Sircilla :సిరిసిల్ల పట్టణాన్ని ముంచెత్తిన వరద... స్తంభించిన జనజీవనం

ABOUT THE AUTHOR

...view details