తెలంగాణ

telangana

By

Published : Apr 1, 2021, 7:50 AM IST

ETV Bharat / state

మందుబాబుల మనసు మారే.. బీరు నుంచి లిక్కర్​కు చేరే..!

'మందు బాబులం మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం'.. మద్యం ప్రియులు మొన్నటిదాకా పాడుకున్న పాట అది. చిల్డ్​.. బీరు తాగితే ఆ కిక్కే వేరప్పా అని నిన్నటిదాకా చెప్పుకున్న డైలాగ్​ ఇది. ఇన్ని రోజులు ఇష్టంగా సేవించిన ఆ చల్లని బీరు.. ఇప్పుడు వారికి చేదెక్కుతోంది. ఒకప్పుడు ఉన్నంత డిమాండ్​ ఇప్పుడు లేదని తెలుస్తోంది. అందుకు కారణం ఏమై ఉంటుంది..? చల్ల చల్లని బీరు తాగడానికి.. బీరు బాబులు ఎందుకంత భయపడుతున్నారు..? తెలుసుకోవాలనుందా.. ఈ స్టోరీ చదివేయండి.

liqueurs instead of cold beer
తగ్గిన బీరు​ అమ్మకాలు

కరోనా సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఆ వైరస్‌ రాకతో పల్లెల నుంచి పట్టణాల వరకు అతలాకుతలమయ్యాయి. అది నేర్పిన పాఠాలు మరెన్నో కళ్లముందు ఆవిష్కృతమయ్యాయి. ఉపాధిని దెబ్బతీసింది. దీంతో అనేక కుటుంబాలు వీధిన పడ్డాయి. చివరికి మందు బాబుల మనసును కూడా మార్చేసింది. మద్యపాన అలవాట్లను తల్లకిందులు చేసింది. చాలా వరకు మద్యం ప్రియులు చల్లని బీరును వదలి క్రమంగా లిక్కర్‌వైపునకు మళ్లుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీరు విక్రయాలు భారీగా తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనం. చల్లటి బీరుతో కరోనా వైరస్‌ త్వరగా వ్యాపిస్తుందనే అపోహ వల్ల మద్యం అమ్మకాల్లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని భావిస్తున్నారు.

వేసవిలోనే మూసివేత..

కరోనా ప్రభావం వల్ల లాక్‌డౌన్‌తో వైన్‌షాపులు, బార్లు, రెస్టారెంట్లను దాదాపు మూడు నెలలపాటు మూసివేయడంతో మద్యం అమ్మకాలు నిలిచిపోయి ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. సాధారణంగా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిసి ఏప్రిల్‌ 1తో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. గతేడాది ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నెలతోపాటు నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్‌ నుంచి మే వరకు మద్యం దుకాణాలు మూసి ఉన్నాయి. వేసవిలోనే బీరు విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వేసవిలోనే మద్యం దుకాణాలు మూతపడటం, చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలనే ఆలోచన కారణంగా మద్యం ప్రియులు లిక్కర్‌ను అలవాటు చేసుకుంటున్నారని భావిస్తున్నారు.

సగానికి పైగా..

జిల్లాలో 2019-2020 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరంలో బీరు విక్రయాలు సగానికి పడిపోయాయి. గతేడాది 9,11,218 పెట్టెల బీర్లు అమ్మగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 5,85,072 పెట్టెలకు పరిమితమయ్యాయి. లిక్కర్‌ విక్రయాలను పరిశీలిస్తే గత సంవత్సరం 4,31,539 పెట్టెలు అమ్మగా, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 4,23,967 పెట్టెలను విక్రయించారు. లిక్కర్‌ అమ్మకాల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించగా జిల్లాలో మొత్తం రూ. 391 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగాయి.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొవిడ్​ ఉద్ధృతి.. రెండో దశపై తప్పిన అంచనాలు!

ABOUT THE AUTHOR

...view details