పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా ఓసీపీ-1 ప్రమాదంలో మరణించిన నలుగురు ఒప్పంద కార్మికుల మృతదేహాలకు ఇంకా శవపరీక్ష జరగలేదు. పరిహారంపై మహాలక్ష్మి కంపెనీ, సింగరేణి యాజమాన్యంతో చర్చలు సఫలం కాలేదు.
మృతుల కుటుంబాలకు మద్దతుగా ఒప్పంద కార్మికులు విధులు బహిష్కరించి సింగరేణి ఏరియా ఆస్పత్రి వద్దకు తరలివచ్చి... నిరసన చేపట్టారు. కోటి రూపాయల పరిహారం సహా మృతుల కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఎల్జీ పాలీమర్స్ గ్యాస్లీకేజీ ఘటనలో బాధితులకు ఏపీ సీఎం జగన్ కోటి రూపాయలు ఇచ్చిన మాదిరిగా.... పరిహారం ప్రకటించాలని స్పష్టం చేస్తున్నారు.
గోదావరిఖని జీఎం కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులు, సింగరేణి అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. సింగరేణి నుంచి 28 లక్షలు మృతుల కుటుంబానికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కార్మిక సంఘాల నాయకులు ఇందుకు ఒప్పుకోలేదు.