తెలంగాణ

telangana

By

Published : Feb 21, 2021, 7:12 AM IST

ETV Bharat / state

'మంథనిలో లీగల్‌ ఫ్యాక్షన్‌ నడుస్తోంది'

న్యాయవాదుల హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వామన్‌రావు కారు డ్రైవర్‌ సతీష్‌తోపాటు ఈ హత్యకు పరోక్షంగా సహకరించిన వసంతరావు, నిందితులకు కత్తులు సరఫరా చేసిన పండ్ల వ్యాపారి, కోర్టు ముందు రెక్కీ నిర్వహించిన అనుమానితుల విచారణ కొనసాగుతోందని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. హత్యోదంతంపై తాజా పరిణామాలు, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం తదితరాలపై ఆయన వివరణ ఇచ్చారు.

ramagundam-cp-satyanarayana-on-lawyer-couple-murder
మంథనిలో లీగల్‌ ఫ్యాక్షన్‌

పెద్దపల్లి జిల్లా గుంజమడుగు మండలంలో వామన్‌రావు దంపతులపై దాడి జరిగిన వెంటనే స్పందించి వారిని పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. ఫిర్యాదు రాకమునుపే దర్యాప్తు ఆరంభించామన్నారు. ‘మంథని నియోజకవర్గంలో పాతికేళ్లకుపైగా రాజకీయ నాయకులు, న్యాయవాదులకు మధ్య ‘లీగల్‌ ఫ్యాక్షన్‌’ నడుస్తోంది. చిన్న ఘటన జరిగినా దానికి సంబంధంలేని ఆరోపణలు చేయడంతోపాటు రాజకీయ, వ్యక్తిగత కక్షలు ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో రచ్చచేయడం ఆనవాయితీగా వస్తోంది. చిన్నపాటి గొడవలను, ఆస్తి తగాదాలను కూడా హైకోర్టు వరకు తీసుకెళ్లడం మామూలైంది. ఇప్పుడేమో పోలీసులపై అభాండాలు వేస్తున్నారు. 2018 ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఎన్నో ఆడియోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. అందులో కొన్నే నిజమైనవి. ఎక్కువగా మార్ఫింగ్‌ చేసినవి. ఆయా సాక్ష్యాలు నిజమైనవని నిర్ధారించకుండా దర్యాప్తులో ఉపయోగించేందుకు చట్టం అంగీకరించదు. న్యాయవాదుల హత్యకు ముందు జరిగినట్టు ప్రచారంలో ఉన్న కొన్ని ఆడియోలు, వీడియోలను నిజ నిర్ధారణ కోసం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌)కు పంపించాం. హత్య జరిగే సమయంలో ఓ వ్యక్తి రికార్డు చేసిన వీడియోను స్వాధీనం చేసుకున్నాం. దాన్నీ ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించాం. హైకోర్టు ఆదేశాల మేరకు కేసులో ప్రమేయం ఉన్న వారందరికీ కఠిన శిక్షపడేలా నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం’ అని సీపీ చెప్పారు.

హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఫోరెన్సిక్‌, సైబర్‌ క్రైమ్‌ నిఘా బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయని తెలిపారు. మృతులకు సంబంధించిన వస్తువులు సహా అన్ని ఆధారాలనూ హైకోర్టు ముందు ఉంచుతామన్నారు.

సాక్ష్యాధారాలు అందించండి: సీపీ

జంట హత్యలకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఎవరి దగ్గరైనా ఉంటే పోలీసులకు అందించి దర్యాప్తుకు సహకరించాలని సీపీ సత్యనారాయణ శనివారం ఉదయం విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు. హత్య జరిగిన సమయంలో ఆ మార్గంలో బస్సులో ప్రయాణించిన వారు సెల్‌ఫోన్‌లో తీసిన వీడియోలు, ఇతర సాక్ష్యాధారాలుంటే 85001 36910 నంబరుకు వాట్సాప్‌లో పంపాలని కోరారు.

విచారణలో నోరు విప్పని బిట్టు శ్రీను

న్యాయవాదులు వామన్‌రావు దంపతుల దారుణ హత్యలకు ఉపయోగించిన వేటకొడవళ్లు, కారు, డ్రైవర్‌లను సమకూర్చిన బిట్టు శ్రీనును శుక్రవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం సాయంత్రం వరకు విచారించారు. తర్వాత రామగుండం కమిషనరేట్‌కు తరలించారు.

దర్యాప్తు ప్రధాన పర్యవేక్షణ అధికారి డీసీపీ(అడ్మిన్‌) ఎన్‌.అశోక్‌కుమార్‌, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన విచారణలో నిందితుడు నోరు విప్పలేదని తెలిసింది. స్థానిక పోలీసులు అండగా ఉంటారనే ధీమాతోనే నిందితులు పట్టపగలే దారుణానికి ఒడిగట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. దర్యాప్తు ప్రక్రియలో స్థానిక ఎస్‌ఐలు, సీఐలు, ఏసీపీ, డీసీపీని పూర్తిగా పక్కనపెట్టారు.

ఒకే బ్యారక్‌లో ముగ్గురు నిందితులు

శుక్రవారం రాత్రి ఈ కేసులో నిందితులైన కుంట శ్రీను, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌లకు మంథని కోర్టు 14 రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. అనంతరం వారిని కరీంనగర్‌ కేంద్ర కారాగారానికి తరలించారు. అంతకుముందు ఏడుగురు నిందితులున్న బ్యారక్‌లోనే వీరినీ ఉంచారు.

ABOUT THE AUTHOR

...view details