తెలంగాణ

telangana

ETV Bharat / state

అర్ధరాత్రి వరకు విచారణ.. 32 మంది బ్యాంకు ఖాతాలపై దృష్టి - peddapally latest news

న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణిల హత్యకు సంబంధించి... పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధును విచారించిన పోలీసులు సోమవారం అర్ధరాత్రి తరువాత ఆయనను ఇంటికి పంపించారు. వామన్‌రావు తండ్రి ఫిర్యాదు మేరకు మూడ్రోజుల కిందట మధును అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కూడా విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించినట్లు తెలుస్తోంది.

Peddaplli ZP Chairman Putta Madhu was sent home by the police
పుట్ట మధును ఇంటికి పంపిన పోలీసులు

By

Published : May 11, 2021, 7:35 AM IST

న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణిల హత్యకు సంబంధించిన విచారణ మరింత లోతుగా జరుగుతోంది. మూడో రోజైన సోమవారం రామగుండం కమిషనరేట్‌లో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు, ఆయన భార్య శైలజతో పాటు మధుకు సన్నిహితుడిగా పేరున్న కమాన్‌పూర్‌ వ్యవసాయ కమిటీ ఛైర్మన్‌ పూదరి సత్యనారాయణను విచారణ అధికారులు రోజంతా వివిధ కోణాల్లో ప్రశ్నించారు. హత్యకు ముందు, తరువాత జరిగిన ఫోన్‌ కాల్‌డాటాతో పాటు ఆర్థిక లావాదేవీల పైనే పోలీసులు ఆరా తీసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా మధు కుటుంబీకులు, సన్నిహితులకు సంబంధించిన 32 బ్యాంకు ఖాతాల వివరాల ఆధారంగా విచారణను ముమ్మరంగా సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత జనవరి 1 నుంచి వారం కిందటి వరకు ఆయా ఖాతాల నుంచి జరిగిన నగదు బదిలీ లావాదేవీల వివరాల్ని పోలీసులు విచారణకు ఆయుధంగా మలచుకున్నట్లు తెలిసింది.

అర్ధరాత్రి తరువాత ఇంటికి...

వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదులో పేర్కొన్నట్లు జైల్లో ఉన్న కుంట శ్రీను తన గ్రామంలో భవనాన్ని ఎలా నిర్మిస్తున్నారు..? మీరు ఆర్థికంగా సాయమందించారా..? అని పుట్ట దంపతుల్ని వేర్వేరుగా అడిగినట్లు తెలిసింది. ఇదే సమయంలో రూ.2 కోట్ల సుపారీపై పోలీసులు భిన్నకోణాల్లో అడిగిన ప్రశ్నలకు విచారణ ఎదుర్కొంటున్న ముగ్గురూ దాదాపు దాటవేత ధోరణిని అవలంబించినట్లు సమాచారం.. ఈ క్రమంలో అధికారులు నిందితులు శైలజ, సత్యనారాయణను మళ్లీ మంగళవారంవిచారణకు హాజరవ్వాలంటూ పంపివేశారు. మధును మాత్రం మూడు రోజులుగా కమిషనరేట్‌లోని ఓ గదిలోనే ఉంచి విచారించిన పోలీసులు సోమవారం అర్ధరాత్రి ఇంటికి పంపించారు. మంగళవారం కూడా విచారణకు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

కాల్‌డాటా ఆధారంగా కూపీ..
వామన్‌రావు దంపతుల హత్య జరిగిన ఫిబ్రవరి 17న, అంతకు ముందు హంతకులు ఫోన్లలో ఎవరెవరితో ఎంతసేపు మాట్లాడారో.. ఆ కాల్‌డాటా సమాచారం ఆధారంగానే కూపీ లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజులుగా పోలీసుల ముందు నోరు మెదపని పుట్ట మధు సోమవారమూ అదే పంథా అనుసరించినట్లు, హత్యల్లో తన ప్రమేయం లేనేలేదని చెప్పినట్లు తెలుస్తోంది. శైలజను ఆమె ఖాతాలో నగదు ఉపసంహరణ గురించి అడిగితే మంథనిలో నిర్మించే తమ సొంతింటి కోసం తీశామని చెప్పినట్లు సమాచారం.

ఫోరెన్సిక్​ సైన్స్​ ల్యాబ్​కు వీడియో...

ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడైన కుంట శ్రీను(ఏ1)ను కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలిసింది. వామన్‌రావు తండ్రి కిషన్‌రావును రామగుండం కమిషరేట్‌కు పిలిపించి విచారించనున్నారు. ఇక హత్య జరిగిన రోజు కొన ఊపిరితో ఉన్న వామన్‌రావు తన వివరాల్ని చెబుతున్న వీడియోలో కుంట శ్రీనుతో పాటు పుట్ట మధు పేర్లు వినిపించాయని, వాటి విషయమై వాస్తవాల కోసం వీడియోను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపించారు. దానిపై అక్కడి నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా కూడా కేసులో మధు ప్రమేయాన్ని నిగ్గుతేల్చే ప్రయత్నంలో విచారణాధికారులు ఉన్నారు.

ఇదీ చదవండి: వామనరావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు భార్యను విచారిస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details