తెలంగాణలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దపల్లి జిల్లాలో మానేరు తీర ప్రాంతాలపై పటిష్ఠ నిఘా ఉంచారు. మానేరు తీరప్రాంతంలో ఉన్న గ్రామాల్లో సుల్తానాబాద్ ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.
మావోల కదలికల నేపథ్యంలో పోలీసుల పటిష్ఠ నిఘా
రాష్ట్రంలో మావోల కదలికల నేపథ్యంలో అప్రమత్తమైన పెద్దపల్లి జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఓదెల మండలం కాల్వశ్రీరాంపూర్లోని మావోయిస్టు సానుభూతిపరులను కలిసి మావోలకు సహకరించవద్దని సూచించారు. ఎవరైనా అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.
ఓదెల మండలంలోని కాల్వశ్రీరాంపూర్లో మావోయిస్టు సానుభూతిపరులను కలిసిన డీసీపీ రవీందర్.. మావోలకు సహకరించవద్దని సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.
అనంతరం కిష్టంపేట గ్రామానికి చెందిన మావోయిస్టు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ ఇంటికి వెళ్లి.. అతను లొంగిపోయి జనజీవన స్రవంతిలో చేరేలా చూడాలని వెంకటేశ్ తల్లి వీరమ్మకు చెప్పారు. హింస ద్వారా సాధించేదేం లేదని, ప్రజాక్షేమం కోసం పోలీసులున్నారని, ఎలాంటి సమస్యలున్నా చట్టపరిధిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. కంకణాల రాజిరెడ్డి లొంగిపోయి.. జనజీవన స్రవంతిలో చేరాలని చెప్పారు.