MLA Sridhar Babu House Arrest: పెద్దపల్లి జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను అరెస్ట్ చేయడాన్ని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తప్పుబట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనను గృహ నిర్భంధం చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి అభివృద్ధికి సహకరించాలని కోరుతుంటే.. మరోవైపు పోలీసులు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను అరెస్ట్ చేయడం ఏంటని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసు రాజ్యమా అని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేయాలని అనుకున్న తనను పోలీసులు అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. గత కొంత కాలంగా రామగుండం ఎరువుల కర్మాగారంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు.
తద్వారా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు. మంథని ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో లిఫ్ట్ ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సాగు నీరు అందించాలని అన్నారు. పోలీసుల తీరు వల్ల ఆ సమస్యలకు పరిష్కారం కాకుండా పోయాయని కనీసం.. ఈ వినతి పత్రాలను పోలీసులు సీఎంకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.
"ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మిడ్ మానేరు ముంపు బాధితులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న సమస్యలపై కాంగ్రెస్ నేతలను పోరాటం చేస్తే వారిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం. వీటన్నింటిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి. ఏ విధంగా నన్ను పోలీసులు ఆపారు. ప్రధానంగా ఆర్ఎఫ్సీఎల్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం." -శ్రీధర్ బాబు,మంథని ఎమ్మెల్యే