రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి మనం చేరడం గర్వకారణమన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం గోపాల్పూర్ గ్రామంలో మానేరు వాగుపై నిర్మించే చెక్డ్యాం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
మంథని నియోజకవర్గంలో ఆరు చెక్డ్యాంల నిర్మాణానికి రూ.110 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు రూపాయి ఖర్చు లేకుండా నీరు ఇస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం రైతుబంధు పథకం, రైతు వేదికల నిర్మాణం జరిగిందని తెలిపారు. రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు రైతు వేదికలు కేంద్రాలుగా మారబోతున్నాయని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.