కాళేశ్వరం ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కృషిలో పాలుపంచుకున్న ఇంజినీర్లు, టెక్నీషియన్లు, వర్కర్లకు శుభాకాంక్షలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
తెలంగాణ వరప్రదాయినిగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి జలాశయం మధ్యమానేరు మార్గంలో ఉన్న ఆరో ప్యాకేజీలోని పంపుల వెట్రన్ను విజయవంతంగా నిర్వహించారు. వెట్రన్కు ముందు సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి పూజలు చేశారు. అనంతరం సర్జ్పూల్లోని నీటిని పంపు ద్వారా ఎత్తిపోశారు. తొలిపంప్ నుంచి కాళేశ్వర గంగ పరుగులు పెట్టింది.
ఉరకలెత్తిన గోదావరి...
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం ఈ వర్షాకాలానికే ఫలాలను రైతులకు అందించాలన్న లక్ష్యంతో ఉంది. అందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు, పంప్హౌజ్ పనులు తుది దశలో ఉండగా... రెండో లింక్లో సిద్ధమైన పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి వాటిని విజయవంతం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అందులోభాగంగా మొదటి పంప్ నుంచి గోదావరి ఉరకలెత్తింది.