తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందూరులో విమానం దిగేనా...? - ఇందూరులో విమానం దిగేనా...?

దశాబ్దం నాటి కల.. దశలవారీ పరిశీలన.. అయినా కొనసాగుతున్న ఊగిసలాట... ఇదీ నిజామాబాద్ జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు పరిస్థితి.. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినందున జిల్లా వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఎయిర్​పోర్టు ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

ఇందూరులో విమానం దిగేనా...?

By

Published : Aug 25, 2019, 9:16 AM IST

ఇందూరులో విమానం దిగేనా...?

నిజమాబాద్ జిల్లా ప్రజల్లో విమానాశ్రయ ఏర్పాటుపై ఆశలు మళ్లీ చిగురించాయి. వైఎస్ హయాంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు ఆలోచన చేయగా.. కేవలం పరిశీలనలు, సర్వేలు తప్ప అడుగు ముందుకు పడలేదు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆరింటి ఏర్పాటుకు సై అన్నందున.. మరోసారి విమానాశ్రయం ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. దశాబ్దకాలంగా నిజామాబాద్ జిల్లా వాసులను ఊరిస్తోన్న ఎయిర్​పోర్టు ఏర్పాటు.. ఇప్పుడైనా ముందుకు కదలాలని భావిస్తున్నారు.

ఏర్పాటుకు 1,600 ఎకరాల భూమి..

మొదట జక్రాన్​పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు కోసం రెండువేల ఎకరాలు అవసరమవుతుందని భావించారు. ఆ తర్వాత డొమెస్టిక్ ఎయిర్​పోర్టు నిర్మించేందుకు మొగ్గు చూపించి 1,600 ఎకరాల భూమి అవసరమవుతుందని భావించారు. ఇందులో 1300 ఎకరాలు అసైన్డ్​ భూములుండగా.. మిగతావి పట్టా భూములున్నాయి. ఒకవేళ విమానాశ్రయం వస్తుందంటే... తగిన పరిహారం చెల్లింపుపై భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.

జక్రాన్​పల్లిలో ఎయిర్​పోర్టుకు అనేక అనుకూలతలు :

  • దేశంలో పెద్దదైన 44వ జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ప్రతిపాదిత స్థలం ఉంది.
  • ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు అధికంగా వెళ్లే వారు నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల నుంచే ఉన్నారు. వీరి రాకపోకలకు విమానాశ్రయం వస్తే ప్రయాణం సుగమమవుతుంది.
  • ఈ స్థలం హైదరాబాద్​కు 170 కి.మీ.ల దూరంలోనే ఉంది. తద్వారా శంషాబాద్ మీద ఒత్తిడి పెరిగితే నిజామాబాద్​ను ప్రత్యామ్నాయంగా వాడుకునే అవకాశముంది.
  • నిజామాబాద్​లో ఉన్న సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు అధికంగా వస్తారు.
  • అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో చదువుకునేందుకు వెళ్లేవారికి ఇక్కడ విమానాశ్రయం అవసరం.

ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన అధికారులు..

సర్కారు నిర్ణయంతో ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్​ ఇండియా బృందాలు రాష్ట్రంలో ప్రతిపాదిత విమానాశ్రయ స్థలాలను పరిశీలిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 21న నిజామాబాద్​ జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. విమానాశ్రయ ఏర్పాటుపై ఫీజిబులిటీ రిపోర్టును కేంద్రానికి అందించనున్నారు. భవిష్యత్తులో విమాన ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఎయిర్​పోర్ట్ ఏర్పాటుపై స్పష్టత రానున్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికైనా బండి కదలాలి..

పదేళ్లుగా విమానాశ్రయ ఏర్పాటు గురించి జిల్లావాసులు ఎదురుచూస్తూ ప్రతిపాదిత స్థలాల్లోనున్న తమ భూముల్లో వ్యవసాయం చేయలేని పరిస్థితి రైతులకు ఎదురైంది. ఎయిర్​పోర్ట్ వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఇన్నాళ్లూ తాత్సారం చేసినా.. ఇప్పుడైనా అడుగుముందుకు పడాలని జిల్లావాసులు ఆశిస్తున్నారు.

ఇదీ చదవండిః ఆ ఆర్మీ దేశాన్ని కాపాడుతోంది... ఈ ఆర్మీ ఆకలిని తీరుస్తోంది...

ABOUT THE AUTHOR

...view details