తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందూరు దవాఖానాలో దాహం తిప్పలు

పడిపోయిన భూగర్భ జలాలు... ఎండిన బోర్లు... సరిపోని కుళాయి నీరు... వెరసి మంచి నీటి కోసం హాహాకారాలు. మూత్రశాలలు, మరుగు దొడ్లలో పోసేందుకు కూడా నీళ్లు దొరకని స్థితికి చేరుకుంది నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి. రోగులు, బంధువులు నీటి సమస్యలతో అల్లాడిపోతున్న అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు.

By

Published : Aug 25, 2019, 1:43 PM IST

ఇందూరు దవాఖానలో దాహం తిప్పలు

ఇందూరు దవాఖానాలో దాహం తిప్పలు

నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఓపీ విభాగంలో ప్రతిరోజూ 1400 మంది చికిత్స పొందుతుంటారు. 500 మంది ఇన్ పేషేంట్​లుగా చికిత్స తీసుకుంటున్నారు. వీరితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి మరో 500 మంది వరకు వస్తుంటారు. 400 మంది వరకు ఆస్పత్రి సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. దాదాపు 3 వేల మంది వరకు ప్రతిరోజు ఆస్పత్రిలో ఉంటున్నా... వారికి తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు దొరకట్లేదు. శౌచాలయానికి వెళ్లాలన్నా... బయట నుంచి నీరు కొనుక్కొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నాలుగు బోర్లున్నా... చుక్క నీరు లేదు

ఇందూరు ప్రభుత్వాస్పత్రిలో మొత్తం నాలుగు బోర్లు ఉండగా... ఇటీవల భూగర్భ జలాలు పడిపోయి రెండు బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. మరో రెండు బోర్లలోనూ నీళ్లు బాగా తగ్గిపోయాయి. ఆస్పత్రిలో గతంలో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రం నిరుపయోగంగా ఉంది. రోగులు, ఆస్పత్రి సిబ్బంది గత కొన్నాళ్లుగా మున్సిపల్ నీటి కుళాయి మీద ఆధారపడి అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే మొన్నటి వరకు 12 గంటలు నీటి సరఫరా చేసిన మున్సిపల్ అధికారులు... నాలుగైదు రోజుల నుంచి కేవలం 6 గంటలకే పరిమితం చేశారు. వీటి వల్ల రోగులు, రోగి తరఫు బంధువులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది.

నీళ్లు కొనుక్కొచ్చి వైద్యం

ఆస్పత్రిలో నీటి సమస్య తారా స్థాయికి చేరడం వల్ల వైద్యంపైనా ప్రభావం పడుతోంది. ప్రధానంగా డయాలసిస్ రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డయాలసిస్ చేయించుకునే రోగులకు రోజు 120 లీటర్ల నీరు అవసరం. ప్రతి రోజూ ఇలా 3వేల లీటర్ల కావాలి. కానీ నీటి కొరత వల్ల బయట నుంచి మినరల్ వాటర్ తెప్పించి డయాలసిస్ చేయాల్సి వస్తోంది. ఈ నీళ్లు కూడా సరిపోకపోవడం వల్ల కొందరికి మాత్రమే డయాలసిస్ చేయగలుగుతున్నారు వైద్యులు. మరికొంత మంది నీటి కోసం ఆస్పత్రి పక్కనే ఉన్న హోటళ్లు, దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. నీరు లేక శౌచాలయాలను కూడా మూసివేశారు. రోగులకు అత్యవసరం అనుకున్నప్పుడు బయట నుంచి నీటిని కొని తెచ్చుకొని మూత్రశాలలను వినియోగించాల్సి వస్తోందని వాపోతున్నారు.

నీళ్లిప్పించండి

ఇంత పెద్ద ఆస్పత్రిలో నీటి సమస్య తీవ్రతరమైనప్పటికీ... అధికార యంత్రాంగం మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: లైవ్​: అరుణ్​ జైట్లీకి కన్నీటి నివాళి

ABOUT THE AUTHOR

...view details