తెలంగాణ

telangana

By

Published : Feb 11, 2021, 1:48 PM IST

ETV Bharat / state

పసుపు ధరలు... కర్కుమిన్‌ శాతం తేల్చకుండానే కొనుగోళ్లు

నిజామాబాద్ యార్డులో పసుపు కొనుగోళ్ల సరిగా సాగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతితో చూసి ధర నిర్ణయిస్తున్నారు. కుప్ప పగలగొట్టి చేతితో విరిచి ఎండిందా? లేదా? అన్నది మాత్రమే చూస్తున్నారు. మార్కెట్‌ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆధునిక యంత్రాల సాయంతో స్వచ్ఛత తేల్చాలని రైతులు కోరుతున్నారు.

turmeric-crop-purchases-at-market-yard-in-nizamabad
పసుపు ధరలు... కర్కుమిన్‌ శాతం తేల్చకుండానే కొనుగోళ్లు

రాష్ట్రంలోనే అతిపెద్ద పసుపు మార్కెట్‌గా పేరొందిన నిజామాబాద్‌ యార్డులో కొనుగోళ్లు నిబంధనల ప్రకారం సాగడం లేదు. కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు పంటను చేతితో చూసి ధర నిర్ణయిస్తున్నారు. మార్కెటుకు వచ్చిన సరకును ఎలా ఉందనే సాంకేతిక నిరూపణ చేయడం లేదు. పది నుంచి ఇరవై మంది పరిశీలించి ధర కోట్‌ చేస్తున్నారు. ఒకే రకమైన పంటను తీసుకెళ్లిన రైతులకు వేర్వేరు ధర చెల్లించిన సందర్భాలు ఉన్నాయి.

నమూనా పరీక్షకు తీసిన పసుపు కొమ్ములు

ఆగిన ఆన్‌లైన్‌ సేవలు

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు జాతీయ వ్యవసాయ మార్కెట్‌ విధానం(ఈనామ్‌)లో ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించింది. అసలు ‘ఈ-నామ్‌’ ఉద్దేశమే దేశంలో ఎక్కడి నుంచైనా వ్యాపారులు సరకు నాణ్యత, స్వచ్ఛతను ఆన్‌లైన్‌లో తెలుసుకుని ధర కోట్‌ చేయాలి. సరిగా పాటించడం లేదు.

చూసి చెప్పేస్తున్నారు

  • జిల్లాలో 36 వేల ఎకరాల్లో పసుపు సాగైంది. గుంటూరు, ఆర్మూర్‌, ప్రతిభ, ఏసీ-79, పితంబర్‌, సేలం వంటి పది రకాల వంగడాలు సాగు చేస్తున్నారు. వీటిల్లో కర్కుమిన్‌ శాతం వేర్వేరుగా ఉంటుంది.
  • రైతులు పంటను ఉడకబెట్టిన తర్వాత ఇరవై రోజుల పాటు ఎండబెట్టి పాలిష్‌ చేసి మార్కెట్‌కు తెస్తుంటారు.
  • కొమ్ము, మండ స్వచ్ఛతను వ్యాపారి పిడికెడు సరకు చేతిలో పట్టుకొని తేల్చేస్తున్నారు. అసలైన పంటకు ధర రాక రైతులు నష్టపోతున్నారనే విమర్శలున్నాయి.

ఆదాయం ఉన్నా నిర్వహణ సున్నా

మార్కెట్‌ యార్డుకు ఫీజు రూపంలో ఏటా రూ.12 కోట్లు వస్తే ఒక్క పసుపుతోనే రూ.పది కోట్ల ఆదాయం వస్తోంది. ఆ నిధులతో మౌలిక వసతులు కల్పించడంతో పాటు పసుపు రైతుకు గిట్టుబాటు ధర రావడానికి పంట స్వచ్ఛత, నాణ్యతను తెలిపే సాంకేతిక యంత్రాలు అందుబాటులోకి తీసుకురావాలి.

సాంకేతికతతో న్యాయం

పంట నాణ్యత ఆధారంగా ధర తేల్చాలి. కుప్ప పగలగొట్టి చేతితో విరిచి ఎండిందా? లేదా? అన్నది మాత్రమే చూస్తున్నారు. పసుపులో చూడాల్సింది కర్కుమిన్‌ శాతం. దీన్ని పట్టించుకోకుండా వ్యాపారులు ధరలు తేల్చుతున్నారు. మార్కెట్‌ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆధునిక యంత్రాల సాయంతో స్వచ్ఛత తేల్చాలి.

వృథాగా మారిన కర్కుమిన్‌ను పరిశీలించే యంత్రం

వృథాగా మారిన కర్కుమిన్‌ను పరిశీలించే యంత్రం

  • మార్కెట్‌ యార్డులో పంటల నాణ్యతను తేల్చే పరీక్ష కేంద్రం ఉంది. ధాన్యం, సోయాబీన్‌, మొక్కజొన్న, పసుపు పంటలను పరీక్షిస్తారు. పసుపు మినహా మిగతా పంటల నమూనాలను రెండు నిమిషాల్లో తేల్చేయవచ్ఛు
  • పసుపు పంటకు మాత్రం నలుగురు వ్యక్తులు కలిసి 25-30 నిమిషాలు శ్రమిస్తేనే దానిలోని తేమ, కర్కుమిన్‌ శాతాల లెక్క తేలుతుంది. సేకరించిన పది కొమ్ములను రోకల్లతో చిన్నగా దంచి, పౌడర్‌గా మార్చిన తర్వాత ప్రత్యేక యంత్రంలో ఆవిరి పట్టి తేమ శాతం పరిశీలించాల్సి ఉంటుంది. మరో యంత్రంలో చూర్ణంలా తయారు చేసి కర్కుమిన్‌ చూస్తున్నారు.
  • పరీక్ష కేంద్రంలో రోజంతా చేసిన 40-50 లాట్‌లకు మించి చేయలేరు. ప్రస్తుతం రోజు 1000-3000 లాట్‌లు (రాశులు) వస్తున్నాయి. మార్చి మొదటి వారానికి మరింత పోటెత్తనుంది. ప్రస్తుతం ఆ యంత్రం మరమ్మతులో ఉంది.

ప్రత్యేక యంత్రం తెప్పిస్తున్నాం

పసుపులోని కర్కుమిన్‌, తేమ శాతాలు పరిశీలించే యంత్రాన్ని స్పైస్‌ బోర్డు నుంచి తెప్పిస్తున్నాం. దానితో పది నిమిషాలకోసారి ఒక నమూనా పరిశీలించొచ్చు. త్వరలోనే పంపిస్తామన్నారు. అందుకే పాత యంత్రానికి మరమ్మతు చేయించడం లేదు. సరైన ధర రాలేదని రైతులు ఫిర్యాదు చేస్తే సరకును పరీక్ష కేంద్రానికి పంపించి నాణ్యతను తేలుస్తున్నాం. కొత్త యంత్రం వచ్చిన తర్వాత వీలైనన్నీ పరీక్షించే అవకాశం ఉంటుంది.

-విజయ్‌కిశోర్‌, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి, నిజామాబాద్‌

ఇదీ చదవండి: వీడియో:ఆభరణాలు మెరుగు పెడతామంటూ వచ్చారు.. బంగారంతో!

ABOUT THE AUTHOR

...view details