తెలంగాణ

telangana

By

Published : Aug 5, 2020, 5:03 PM IST

ETV Bharat / state

నిర్మాణ రంగాన్ని అతలాకుతలం చేసిన కరోనా

కరోనా మహమ్మారి అన్నింటినీ అతలాకుతలం చేస్తోంది. కరోనా ప్రభావం నిర్మాణ రంగాన్ని కుదిపేసింది. లాక్ డౌన్ సమయంలో కూలీలందరూ... స్వస్థలాలకు వెళ్లిపోగా కేసులు పెరుగుతుండటంతో తిరిగి రావడం లేదు. దీంతో నిర్మాణ రంగం పూర్తిగా పడకేసింది. అపార్టుమెంట్లు, ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. స్థానికంగా ఉన్న కూలీలు, మేస్త్రీలతో చిన్న చిన్న పనులు చేస్తున్నా.. కరోనా భయం వెంటాడుతోంది. ఉపాధి కోల్పోయి కూలీలు, మేస్త్రీలు... నిర్మాణాలు నిలిచిపోయి గుత్తేదార్లు ఆందోళన చెందుతున్నారు.

నిర్మాణ రంగాన్ని అతలాకుతలం చేసిన కరోనా
నిర్మాణ రంగాన్ని అతలాకుతలం చేసిన కరోనా

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో కార్మికులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 60వేలు, కామారెడ్డిలో 30వేల మంది నిర్మాణం రంగంతో ఉపాధి పొందుతున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వలసొచ్చిన కూలీలు మరో 30వేల మంది వరకు ఉంటారని అంచనా. లాక్ డౌన్ సమయంలో యూపీ, బిహార్, ఏపీకి చెందిన వారిలో 25వేల మందికి పైగా స్వస్థలాలకు వెళ్లిపోయారు.

కూలీల కొరత..

అందులో కేవలం 5వేల మంది వరకే తిరిగి పనుల కోసం వచ్చారు. ఉభయ జిల్లాల్లో కలిపి 90వేల మంది కార్మికులు ఉన్నా... ఎక్కువ మంది కూలీలు, సహాయకులుగా మాత్రమే ఉన్నారు. దీంతో నైపుణ్యత కలిగిన కూలీల కొరత ఉంది. కరోనా కేసులు ప్రస్తుతం తీవ్రమవుతున్న నేపథ్యంలో స్థానిక కూలీలు, మేస్త్రీలు సైతం పనులకు వెళ్లాలంటే భయం పట్టుకుంటోంది.

ఆగిన పనులు..

నిజామాబాద్ లో రెండేళ్ల కిందట 100 లోపు ఉన్న అపార్టుమెంట్ల సంఖ్య ప్రస్తుతం 160కి చేరింది. నిర్మాణ దశలో మరో 50వరకు ఉన్నాయి. కూలీలు లేకపోవడం వల్ల నగరంలోని కంఠేశ్వర్, గంగాస్థానం ప్రాంతాల్లోనే 30కిపైగా అపార్టుమెంట్ల నిర్మాణం నిలిచిపోయాయి. ఏడాది రెండేళ్ల నుంచి అపార్టుమెంట్ల నిర్మాణం కోసం కోట్లు ఖర్చు చేసిన గుత్తేదార్లు.. పనులు ఆగిపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీ భారం అవుతోంది.

ఒక్కటి కూడా..

బహుళ అంతస్థులు, భారీ భవనాలు మాత్రమే కాకుండా సాధారణ ఇళ్ల నిర్మాణాలూ పూర్తిగా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఒక్కో గుత్తేదారు ఏడాదికి 8- 10 ఇళ్లు పూర్తి చేసేవారు. కానీ గత ఐదు నెలలుగా నిర్మాణ రంగం పడకేయడంతో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయని దుస్థితి ఉంది.

ఇబ్బందులు..

నిర్మాణ రంగం పూర్తిగా పడకేయడంతో ఈ రంగంపై ఆధారపడిన స్థానిక కూలీలు, మేస్త్రీలు ఉపాధి కోల్పోయారు. గతంలో చేతి నిండా పని దొరికేది. కానీ ప్రస్తుతం వారంలో రెండు మూడు రోజులు పని దొరకడమే గగనం అవుతోంది. పని లేకపోవడంతో కుటుంబాన్ని నెట్టుకురావడం ఇబ్బందిగా ఉందని మేస్త్రీలు, కూలీలు చెబుతున్నారు.

ప్రభుత్వం స్పందించి నిర్మాణ రంగంపై ఆధారపడిన వేల మంది భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు. లేదంటే కుటుంబాలను పోషించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details