తెలంగాణ

telangana

ETV Bharat / state

Yasangi paddy cultivation: యాసంగిలో వరి ధాన్యం సాగుపై రైతుల్లో అయోమయం

Yasangi paddy cultivation: యాసంగిలో వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు ఏం వేయాలో తెలియక రైతులు అయోమయంలో పడ్డారు. యాసంగి ధాన్యం కొనమని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన కౌలు రైతులపై తీవ్రంగా పడింది. కొనుగోళ్లు లేనందున కౌలు భూములను వదిలేస్తున్నారు. పంట అమ్ముకునే పరిస్థితి లేనందున.. కౌలు జోలికి వెళ్లలేమని తేల్చి చెబుతున్నారు. యజమానులు కూడా కౌలు తగ్గించి ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు.

By

Published : Dec 6, 2021, 3:10 AM IST

Yasangi paddy cultivation: యాసంగిలో వరి ధాన్యం సాగుపై రైతుల్లో అయోమయం
Yasangi paddy cultivation: యాసంగిలో వరి ధాన్యం సాగుపై రైతుల్లో అయోమయం

యాసంగిలో వరి ధాన్యం సాగుపై రైతుల్లో అయోమయం

Yasangi paddy cultivation: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై నెలకొన్న అనిశ్చితి... సాగుపై ప్రభావం చూపుతోంది. వరినాట్లు వేసే విషయంలో సొంత భూమి ఉన్న రైతులు ఆచితూచి ధైర్యం చేస్తుంటే.. కౌలుదారులు వెనుకంజ వేస్తున్నారు. తమ పొలాలు పడావుగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన యజమానులు.. ధరలు తగ్గించేందుకు అంగీకరిస్తున్నారు. ఇప్పటికే పంట పెట్టుబడి విపరీతంగా పెరిగి.. తెగుళ్ల బెడదతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీంతో కౌలురైతులు ఈ యాసంగిలో సాగుకు అంతగా ముందుకు రావడం లేదు.

వెనుకంజ వేస్తున్న కౌలు రైతులు

మెట్ట ప్రాంతాల్లో ఆరుతడి పంటలు వేయాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఆరుతడి పంటల విత్తన లభ్యతపై స్పష్టతనివ్వడం లేదు. దీంతో సొంత పొలం ఉన్న రైతులు ఆచితూచి సాగుకు సమాయత్తం అవుతున్నారు. కౌలు రైతులు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఒప్పందాలు ముందుకు సాగడం లేదు. యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని.. రాష్ట్రప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో భూములను కౌలుకు తీసుకుని.. సాగు చేస్తే శ్రమ వృథా అవుతుంది తప్ప లాభం ఉండదని కౌలు రైతులు భావిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం కొనకుంటే దళారులకు అడిగినంతకు ఇవ్వాల్సి ఉంటుందని.. అలాంటప్పుడు కౌలుకు దూరంగా ఉండటమే మేలన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తం అవుతోంది.

దిగివస్తున్న యజమానులు

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణంలో 30శాతం కౌలు ఉంటుంది. కౌలు చేసే రైతుల్లో ఎక్కువ మంది తమకున్న పొలంతో పాటు ఇతరుల భూములను కౌలుగా తీసుకుని పంటలు సాగు చేస్తుంటారు. ఇందుకు ధాన్యం లేదా డబ్బులు కౌలుగా చెల్లిస్తున్నారు. యాసంగిలో సాధారణంగా ఎకరానికి 13 నుంచి 25 బస్తాల ధాన్యం లేదా 13 నుంచి 15వేల రూపాయలు కౌలుగా ఇవ్వాల్సి ఉంటుంది. కౌలు రైతులు వెనుకంజ వేస్తున్న పరిస్థితుల్లో యజమానులు సైతం దిగివస్తున్నారు. భూములను తక్కువ ధరకే ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారు. సమస్య ఉన్న ప్రాంతాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు రంగంలోకి దిగాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మెట్ట ప్రాంతాల్లో 6 బస్తాలు.. మాగాణిలో అయితే 9బస్తాలు కౌలు ఇవ్వాలని పలుచోట్ల కమిటీలు నిర్ణయించాయి.

సొంత భూములున్న కౌలు రైతులు అంత వరకే పంటలు వేస్తుండగా.. అసలే భూమి లేని కౌలు రైతులు మాత్రం సందిగ్ధంలో పడ్డారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details