తెలంగాణ

telangana

ETV Bharat / state

Flood flow to projects: జోరు వానలకు ప్రాజెక్టులకు జలకళ.. పొంగిపొర్లుతున్న వాగులు - flood flow to projects due to heavy rains

రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. జోరు వానలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరామ సాగర్​ ప్రాజెక్టు, భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు జలాశయం, సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది.

flood flow to projects
నిండుతున్న జలాశయాలు

By

Published : Jul 14, 2021, 1:09 PM IST

Updated : Jul 14, 2021, 1:19 PM IST

గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్​ జిల్లాలో

నిజామాబాద్​ జిల్లా గోదావరి పరీవాహకంలో శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు వేగంగా నిండుతోంది. ప్రస్తుతం ఎస్సారెస్పీకి 75,090 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 60 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. జలాశయంలో 1079.80 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలకు గాను ఇప్పటికే 18.09 టీఎంసీలకు చేరుకుంది. 19.50 టీఎంసీలకు నీరు చేరితే గేట్లు తెరిచే అవకాశాలున్నట్లు ప్రాజెక్టు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కడెంతో పాటు ఎగువ నుంచి 12,123 క్యూసెక్కుల వరద వస్తోంది.

సూర్యాపేట జిల్లాలో

సూర్యాపేట జిల్లాలో మూసీ నదికి వరద ప్రవాహం భారీగా చేరుతోంది. ప్రాజెక్టు ఇన్​ఫ్లో 6 వేల క్యూసెక్కులు కాగా, అవుట్​ ఫ్లో 4,200గా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 642 అడుగులకు చేరుకుంది. అధికారులు ప్రాజెక్టు 6 క్రస్ట్​ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ భాస్కరన్‌ సూచించారు.

నిర్మల్ జిల్లాలో

నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 696.17 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటినిల్వ 6.473 టీఎంసీల వద్ద ఉంది. 4 వరద గేట్ల ద్వారా అధికారులు 23,677 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

భద్రాద్రి జిల్లాలో తాలిపేరు జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు 16గేట్లు ఎత్తి 11,248 క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

హిమాయత్​సాగర్​కు వరద

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్​పల్లి- షాబాద్- మొయినాబాద్ మండలాల్లో ఈసీ, మూసీ నుంచి వచ్చే వాగులు పొంగిపొర్లుతున్నాయి. శంకర్​పల్లి మండలంలోని పొద్దుటూరు, చిన్న మంగళారం మీదుగా వరద నీరు గండిపేటకు చేరుతోంది. అదేవిధంగా ఈసీ వాగు వరద షాబాద్ మండలం నాగర్ గూడా, వెంకటాపూర్, అండపూర్ మీదుగా హిమాయత్ సాగర్​కు చేరుతోంది.

జోరు వానలకు నిండుతున్న జలాశయాలు, పొంగుతున్న వాగులు

ఇదీ చదవండి:VIKARABAD: వికారాబాద్​ జిల్లాలో విస్తారంగా వర్షాలు... పొంగిపొర్లుతున్న వాగులు

Last Updated : Jul 14, 2021, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details