ప్రతీ వ్యక్తిపై...చుట్టు ఉన్న పరిస్థితులు, వాళ్లు చూసిన సంఘటనలు, అనుభవాలు తీవ్రంగా ప్రభావం చూపుతుంటాయి. అవే వాళ్ల వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తాయి. అయితే.. కొంత మంది కష్టాల్ని సాకుగా చూపి...చెడు బాట పడితే, మరికొందరు.. నలుగురికీ ఆదర్శంగా నిలిచేలా తమ జీవితాల్ని తీర్చిదిద్దుకుంటారు. అలాంటి వాళ్లల్లో ఒకరిగా నిలుస్తోంది... నిజామాబాద్ జిల్లా భీంగల్కు చెందిన అంకం జ్యోతి.
జ్యోతి తల్లిదండ్రులు నిత్యం గొడవపడుతుండే వాళ్లు. చీటికీమాటికి పోట్లాడుకునే వారు. ఆ గొడవలు, ఆందోళనల మధ్యలోనే జ్యోతి, ఆమె ఇద్దరు చెల్లెల్లు బిక్కుబిక్కుమంటూ గడిపే వాళ్లు. అనుకోకుండా జరిగిన ఓ ఘటనతో వీళ్ల జీవితాలే మారిపోయాయి. సమాజంలో ఒంటరిగా మిగిలిపోయారు.
ఏదైనా సాధించాలనే పట్టుదలతో
నాన్నమ్మ దగ్గరే పెరిగిన ముగ్గురు ఆడపిల్లలు..ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు ప్రేమను కోల్పోయిన జ్యోతి... సరిగా పట్టించుకునే వాళ్లు లేక జీవితంలో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంది. ఒకానొక దశలో ఆత్మహత్యకు ప్రయత్నించి... చెల్లెలు గుర్తుకు రావడంతో.. విరమించుకుంది. అంతే కాదు... ముగ్గురిలో జ్యోతినే పెద్దది కావడంతో... కుటుంబ బాధ్యతల్ని భుజానికెత్తుకుంది. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలను పెంచుకుని ఆ దిశగా ప్రయాణం ప్రారంభించింది.
మేం ముగ్గురం అక్కచెల్లేలం. మమ్మల్ని నాయనమ్మ చూసుకునేది. నా బాల్యం అంత గొప్పగా బతకలేదు. ఓ రోజు అన్నం దొరికితే తినేదాన్ని. ఓ రోజు పాడైనా అన్నమైనా తినేదాన్ని. అందరూ కొట్టేవాళ్లు. తిట్టేవాళ్లు. అయినా... సరే మాచెల్లేల కోసం బతకాలి అనుకున్నా...
- అంకం జ్యోతి, సామాజిక సేవకురాలు, నిజామాబాద్
ఆకలి బాధలు తెలిసి...
నిజామాబాద్లోని తెలంగాణ జాగృతిలో 3 నెలల లాజిస్టిక్స్ కోర్సు నేర్చుకున్న జ్యోతి.. ఓ సంస్థలో ప్రైవేట్ ఉద్యోగంలో చేరింది. నగరంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ... పని చేసింది. ఆ సమయంలోనే తన సంపాదిస్తున్న కొద్ది మొత్తంలోనే సేవా కార్యక్రమాలు చేయడం ప్రారంభించింది. ఒకప్పుడు తాను అనుభవించిన ఆకలి బాధల విలువ తెలియడంతో.. అలాంటి వాళ్లు కనిపిస్తే చాలు తోచినంత సాయం చేయడం మొదలు పెట్టింది.