తెలంగాణ

telangana

Record Power Production: శ్రీరాంసాగర్​లో రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి

By

Published : Oct 6, 2021, 5:20 AM IST

అధిక వర్షాలు, పోటెత్తిన వరదతో నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జలవిద్యుత్‌ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి జరిగింది. ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే రికార్డులన్నీ తిరగరాసేలా ఏకంగా 23.73 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి చేశారు.

Record Power Production
శ్రీరాంసాగర్​లో రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ ఏడాది భారీ వర్షాలతో భారీగా వరద వచ్చింది. జులై రెండో వారంలోనే వానలు మొదలవగా.. ఎన్నడూ లేని విధంగా జులై 22 వరకే ప్రాజెక్టు నిండి గేట్లు ఎత్తారు. అప్పటి నుంచి నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాదిలో జూన్ 1 నుంచి 549.9 టీఎంసీల నీరు ప్రాజెక్టుకు చేరగా.. 479.6 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారంటే.. ఏ స్థాయిలో వరద వచ్చిందో తెలుసుకోవచ్చు. దీంతో నిరంతరాయంగా జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీటిని విడుదల చేయగా.. గరిష్ఠ ఉత్పత్తి నమోదైంది.

పోచంపాడు జలవిద్యుత్‌ కేంద్రంలో సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో ఉత్పాదన జరిగింది. నెలలోనే 23.73 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో నమోదైన 21.14 మిలియన్ యూనిట్ల గరిష్ఠ ఉత్పత్తిని ఈ నెలలో అధిగమించారు. జలవిద్యుత్ కేంద్రంలో నాలుగు టర్భైన్లు ఉండగా.. ఒక్కో టర్భైన్ సామర్థ్యం 9 మెగావాట్లుగా ఉంది. ఒక్కటి నడపాలన్నా కాకతీయ కాల్వకు 2వేల క్యూసెక్కులు వదలాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలైలోనే ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో జలాలను దిగువకు వదులుతున్నారు. ఆయకట్టుకు పెద్దగా నీటి అవసరం లేకపోవడంతో.. కాల్వతోపాటు ఎస్కేప్ గేట్ల ద్వారా వదులుతున్న నీటిని నదిలోకి మళ్లిస్తున్నారు. వీటిద్వారా నిరంతరం విద్యుదుత్పత్తి జరుగుతోంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలో 1990-91లో 146మిలియన్‌ యూనిట్లతో రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది ఆ రికార్డును అధిగమించే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 1నుంచి అక్టోబర్ 3నాటికి 55.8276 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. పరిస్థితిని బట్టి చూస్తే ఈ ఏడాది100 మిలియన్ యూనిట్ల మార్కును దాటే అవకాశం ఉంది.


ఇదీ చూడండి: SRSP: శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

ABOUT THE AUTHOR

...view details