తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-22కు నిధుల గండం

కాళేశ్వరం నీళ్లు ఎప్పుడెప్పుడు తమ ఊర్లో ప్రవహిస్తాయా అని ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటే.. ప్యాకేజీ-22 భూ సేకరణలో తీవ్ర జాప్యం జరిగి పనులు ముందుకు కదలడం లేదు. ఈ ప్యాకేజీని కార్పొరేషన్‌ పరిధిలోకి చేర్చి నిధులను త్వరితగతిన విడుదల చేస్తే పనులు మరింత వేగవంతంగా జరుగుతాయని స్థానికులు, అధికారులు అంటున్నారు.

By

Published : Mar 16, 2020, 8:04 PM IST

Package-22 of the Kaleshwaram Project: Severe delay in land acquisition in nizamabad
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్యాకేజీ-22కు నిధుల గండం

కోటి ఎకరాలకు సాగునీటిని అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపడుతోంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేపట్టింది. గత నాలుగు రోజుల కిందట మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలను సింగూరు, నిజాంసాగర్‌కు తరలించేందుకు లింక్‌-6 పనుల పాత అలైన్‌మెంటుకు అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం ఈ పనులను కార్పొరేషన్‌ పరిధిలో చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.

నిధులలో జాప్యం..

ఇంత వరకు బాగానే ఉన్నా కామారెడ్డి, మెదక్‌ జిల్లాలకు కాళేశ్వరం జలాలు అందించేందుకు నిర్దేశించిన ప్యాకేజీ-22 పనుల్లో భాగంగా కాలువలు, రిజర్వాయర్ల తవ్వకాల కోసం చేపట్టిన భూ సేకరణకు నిధుల విడుదలలో జాప్యం నెలకొంది. ఫలితంగా ‘అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి’ అన్న చందంగా పనులు సాగుతున్నాయి. ఈ పనుల ప్రగతిపై సమీక్షించే నాథుడే కరవయ్యాడు. భూసేకరణ, బిల్లుల చెల్లింపులు ప్యాకేజీ పనులకు ప్రధాన అడ్డంకిగా మారాయి.

భూ సేకరణలోనే ఆగిపోయిన ప్యాకేజీ-22

నిజామాబాద్‌ జిల్లాతో పాటు కామారెడ్డి, మెదక్‌ జిల్లాలకు నీరందించేందుకు ప్యాకేజీ-20, 21, 22 కింద పనులు చేపట్టాలని నిర్ణయించారు. వీటిలో ప్యాకేజీ-20, 21 పనులు పూర్తిగా నిజామాబాద్‌ జిల్లాకు సాగునీటిని అందించేందుకు ఉద్దేశించినవి. వీటిలో ప్యాకేజీ-20 పూర్తిగా టన్నెల్‌ తవ్వకాలకు సంబంధించింది. వీటి పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో ఆయకట్టుకు నీరందించేందుకు నిర్దేశించిన ప్యాకేజీ-21 పనులు వేగంగా పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు ప్యాకేజీ-21, ప్యాకేజీ-21(ఏ)గా విభజించి పనులు చేపడుతున్నారు. ఈ పనులు సైతం 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. వీటితోపాటే ప్రారంభించిన ప్యాకేజీ -22 పనులు మాత్రం ఇంకా భూ సేకరణ దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరులో జాప్యం జరుగుతుంటడం సమస్యగా మారింది. ఈ నెల 10న జిల్లా యంత్రాంగం కాళేశ్వరం చీఫ్‌ ఇంజినీర్‌కు భూ సేకరణ నిధులు విడుదల చేయాలని కోరుతూ లేఖ రాశారు. ప్రస్తుతం బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని నిధులు మంజూరుకు కృషి చేస్తేనే భూ సేకరణ సజావుగా సాగే అవకాశం ఉంది.

నత్తనడకన ప్యాకేజీ -22 పనులు

ప్యాకేజీ-22లో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలో మోపాల్‌ మండలం అమ్రాద్‌ కొండం చెరువు నుంచి 1.9 కి.మీ మేర అప్రోచ్‌ కెనాల్‌ తవ్వకం చేపట్టాల్సి ఉంది. ఇక్కడి నుంచి 5.5 కి.మీ మేర టన్నెల్‌ తవ్వాలి. ఇప్పటి వరకు కేవలం అప్రోచ్‌ కాలువ మాత్రమే పూర్తయింది. కేవలం 450 మీటర్ల మేర టన్నెల్‌ తవ్వకం పూర్తిచేశారు. సదాశివనగర్‌ మండలం యాచారం వద్ద పంప్‌హౌస్‌ నిర్మించాల్సి ఉంది. కానీ భూసేకరణ చేపట్టకపోవటంతో పనులు ప్రారంభించలేదు. వీటితో పాటు భూంపల్లి రిజర్వాయర్‌ నుంచి తవ్వాల్సిన ఎడమ, కుడి, రిడ్జ్‌ కాలువల తవ్వకాలు చేపడుతున్న గుత్తేదారుకు బిల్లుల చెల్లింపులో జాప్యంతో నత్తనడకన పనులు సాగుతున్నాయి. వీటితో భూంపల్లి రిజర్వాయర్‌ నుంచి ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ఉపకాలువల కోసం భూసేకరణ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది.

రిజర్వాయర్ల నిర్మాణంపై స్పష్టత కరవు

కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు మెదక్‌ నియోజకవర్గంలో పలు ప్రాంతాలకు సాగునీటిని గ్రావిటీ ద్వారా పంపిణీ చేసేందుకు కామారెడ్డి జిల్లాలో మొదట ఐదు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆరు రిజర్వాయర్లను నిర్మించనున్నట్లు ఇటీవల ప్రకటించిన ఆర్థిక గణాంక సర్వేలో స్పష్టం చేశారు. జిల్లాలో భూంపల్లి, మోతె, కాటెవాడి, తిమ్మక్‌పల్లి, ధర్మారావుపేట, ముద్దోజివాడి చెరువులను రిజర్వాయర్లుగా మార్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటి నిర్మాణానికి ఎంత భూసేకరణ చేయాలో? ఎప్పుడు నిర్మాణాలు ప్రారంభిస్తారో స్పష్టత కొరవడింది.

కార్పోరేషన్‌ పరిధిలోని పనుల్లోనే ప్రగతి

కాళేశ్వరం జలాశయం నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. దీని పరిధిలోని ప్యాకేజీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లింక్‌-6 పనులు చేపడుతున్నారు. ఈ పనులే పూర్తికావడానికి ఇంకా మూడేళ్లు పట్టేలా ఉందని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. ప్యాకేజీ-22 పనులను లింక్‌-7లో భాగంగా చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరింత సమయం పడుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

వివరాలు ఇవీ..

సేకరించాల్సి భూమి: 2810.00 ఎకరాలు

ఇప్పటి వరకు సేకరించింది: 1226.12 ఎకరాలు

సేకరించాల్సింది: 1583.27 ఎకరాలు

భూ సేకరణ కోసం చెల్లించాల్సిన నిధులు: రూ.67.66 కోట్లు

ఇప్పటి వరకు చెల్లించిన మొత్తం: రూ. 19.74 కోట్లు

ఇంకా చెల్లించాల్సింది : రూ. 47.92 కోట్లు

ప్యాకేజీ- 22 నిర్మాణ పనుల వివరాలు

ఆయకట్టు: 2 లక్షల ఎకరాలు

తవ్వాల్సిన కాలువల పొడవు: 100.80 కి.మీ.

అప్రోచ్‌ కాలువ పొడవు: 1.900 కి.మీ

సొరంగం పొడవు: 1.90 కి.మీ నుంచి 7.560 కి.మీ

ఎడమ కాలువ పొడవు: 51 కి.మీ

కుడి కాలువ పొడవు: 11.975 కి.మీ

రిడ్జి కాలువ పొడవు: 14.25 కి.మీ

ఇదీ చూడండి :సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details