తెలంగాణ

telangana

ETV Bharat / state

Normal Deliveries in Telangana: ప్రసవ వేదన తీరేదెలా.. కడుపు 'కోత' తగ్గేదెలా? - cesarean deliveries in Nizamabad

Normal Deliveries in Telangana : సాధారణ ప్రసవాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం, ప్రైవేట్‌ అనే తేడానే లేదు.. అన్ని చోట్లా సిజేరియన్లే అధికంగా జరుగుతున్నాయి. ఫలితంగా తల్లులు.. అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. పిల్లలు అమృతం లాంటి ముర్రుపాలకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితులు ఉత్తర తెలంగాణా జిల్లాలో అధికంగా ఉంటోంది. ఇదే విషయాన్ని డబ్ల్యూహెచ్ కూడా స్పష్టం చేసిందని స్వయంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు సీ-సెక్షన్ లు పెరగడానికి అనేక అంశాలు కారణమంటున్నారు. ఇంతకు ఏంటా కారణాలు..? సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు ఉన్న మార్గాలేంటి..?

Normal Deliveries in Telangana
Normal Deliveries in Telangana

By

Published : Mar 10, 2022, 11:34 AM IST

పాత కాలం రావాలి.. సాధారణ ప్రసవాలు పెరగాలి

Normal Deliveries in Telangana : ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణ ప్రసవాలు బాగా తగ్గిపోయాయి. దాంతో సహజంగానే సిజేరియన్లూ విపరీతంగా పెరిగిపోయాయి. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌ఓ సైతం స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాల వల్ల.. బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులు అనారోగ్యానికి గురవుతుంటే.. పిల్లలు ముర్రు పాలకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితి మారాలి..! ఇటీవల కామారెడ్డిలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చేసిన వాఖ్యలివి. సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా .. క్షేత్ర స్థాయిలో సరైన పర్యవేక్షణ లేక సిజేరియన్‌ ఆపరేషన్లు పెరిగి పోయాయని అన్నారు. రాష్ట్రంలో కేవలం 34% మంది పిల్లలే.. పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగుతున్నారని.. మిగతా పిల్లలకు ఈ అవకాశం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

పెరిగిపోతున్న సిజేరియన్లు..

cesarean deliveries in Telangana : గ్రామం, పట్టణం అనే తేడా లేదు.. అన్ని ప్రాంతాల్లో సిజేరియన్లు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగేవి. నేడు ఆ పరిస్థితి మారిపోయి.. గ్రామీణ వాసుల్లోనూ సిజేరియన్ల సంఖ్య పెరుగుతుండడం.. ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆపరేషన్లకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుండగా.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని జనరల్ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. జిల్లా కేంద్ర ఆస్పత్రులకు ఎక్కువగా రిఫరల్‌ కేసులు వస్తాయి. పీహెచ్​సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల నుంచి రక్తహీనత, నెగటివ్ రక్త గ్రూపు ఉన్నవారు, ఇతర అత్యవసర కారణాల వల్ల ఇక్కడికి తీసుకొస్తారు. అప్పుడు కచ్చితంగా సిజేరియన్ చేయడం తప్ప మరో మార్గం ఉండటం లేదని ఆస్పత్రి వర్గాలు తెలియ జేస్తున్నాయి. మొదటి సారి కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి వీలైనంత వరకు సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఐనా.. శాతాల పరంగా సీజేరియన్లే ఎక్కువగా ఉంటున్నాయి. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో గతేడాది మొత్తం 3వేల ప్రసవాలు జరగగా.. ఈ ఏడాది జనవరిలో 300ప్రసవాలు.. ఫిబ్రవరిలో సుమారు 280 ప్రసవాలు అయ్యాయి. ఇందులో 70-80శాతం సిజేరియన్లే ఉన్నాయి. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రతి నెలా 800-900వరకు ప్రసవాలు జరుగుతుండగా.. ఇందులో 60% వరకు సిజేరియన్లే ఉంటున్నాయి.

ముహూర్తం చూసి కాన్పులు..

Normal Deliveries in Nizamabad : ఈ మధ్య కాలంలో ముహుర్తం చూసి కాన్పులు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాంటి వారంతా ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఫలానా రోజు, తేది, సమయం పక్కగా చూసుకుని.. పిల్లల్ని కనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు.. మరికొందరు గర్భిణీకి ఎప్పుడు మత్తు ఇవ్వాలి, ఎప్పుడు బిడ్డ బయటకు రావాలన్న విషయాలూ నిర్ణయిస్తుండ టం సిజేరియన్లకు ప్రధాన కారణంగా మారుతోంది. మరోవైపు.. కాలక్రమేణ మహిళలు నొప్పుల్ని భరించలేకపోతున్నారు. దీంతో.. తల్లిదండ్రులు, బంధువులు సైతం తమ అమ్మాయి నొప్పి భరించలేదంటూ.. సిజేరియన్‌కు మెుగ్గు చూపుతున్నారు.

రిస్క్ ఎందుకని..

Normal Deliveries in Kamareddy : కొందరు వైద్యులు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఐనా.. గర్భిణీ కుటుంబం, బంధువుల నుంచి మద్దతు ఉండటం లేదు. సాధారణ ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తితే డాక్టర్లదే పూర్తి బాధ్యత అని చెబుతున్నారు. వైద్యులు రిస్క్‌ తీసుకోవడం ఎందుకని అనుకుంటున్నారేమో గానీ సిజేరీయన్లకే మెుగ్గు చూపుతున్నారు. కొందరు సాధారణ ప్రసవం చేయించుకోవాలని అనుకుంటున్నప్పటికీ.. శరీరం సహకరించడం లేదు. కారణాలు ఏవైనా గానీ, సిజేరియన్ల వల్ల తల్లులు భవిష్యత్ లో చిన్న చిన్న బరువులు ఎత్తలేని స్థితి ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు.. కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సిజేరియన్లతో ముర్రుపాలకు దూరం..

cesarean deliveries in Nizamabad : సిజేరియన్ల కారణంగా ఎక్కువ శాతం మంది పిల్లలు అమృతం లాంటి ముర్రుపాలకు దూర మవుతున్నారు. అపోహలు, అనుమానాలు, ఇతర కారణాలతో బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు అందడం లేదు. సాధారణంగా పుట్టిన బిడ్డ మొదటి గంటలో చాలా తక్కువ మొత్తంలో తల్లికి పాలు వస్తాయి. వాటినే ముర్రుపాలుగా పిలుస్తుంటారు. వీటిలో బిడ్డకు కావాల్సిన అన్ని పోషకాలు, విటమిన్లు ఉంటాయి. వీటిని బిడ్డకు పట్టడం వల్ల.. ఆ వయసులో ప్రమాదకర రోగాలను తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి అందుతుంది. పైగా.. అప్పుడే పుట్టిన బిడ్డకు సులువుగా జీర్ణం అవుతాయి. అందుకే.. ఈ పాలను అమృతంగా చెబుతుంటారు.. వైద్యులు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పాలను.. తెలంగాణలో కేవలం 34% మంది మాత్రమే మొదటి గంటలో ముర్రు పాలు తాగుతున్నారని అంచనా. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి. సీజేరియన్లు చేసినప్పుడు తల్లికి మత్తు ఇస్తారు కాబట్టి పాలు పట్టకూడదన్న అపోహ కొందరిలో ఉంది. అలాగే, కొందరు ఈ పాలు మంచివి కావన్న భావనతో పారబోస్తున్నారు. ఇలా అనేక కారణాలతో పిల్లలను ముర్రుపాలకు దూరం చేసి వారికి సహజంగా లభించే రోగనిరోధక శక్తి అందకుండా చేస్తున్నారు. సాధారణ ప్రసవం అయితే పుట్టిన గంటలోపు, సిజేరియన్ అయితే 2 గంటల్లోపు ముర్రుపాలు పట్టించాలని వైద్యులు చెబుతున్నారు. తద్వారా.. తల్లిపాలు జీర్ణాశయాంతర వ్యాధుల నుండి రక్షణ, ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. నవజాత శిశువు మరణాలను తగ్గిస్తుంది. ఎక్కువ కాలం పాలివ్వడం వల్ల తల్లులు అండాశయ, రొమ్ము క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఎనీమియాతో ఇబ్బందులు

cesarean deliveries in Kamareddy : గర్భిణీ స్త్రీలలో కనిపించే మరో ప్రధాన సమస్య.. రక్తహీనత. దీనివల్ల తక్కువ బరువుతో పిల్లలు జన్మించడం, అధిక రక్తస్రావం వల్ల ఒక్కోసారి బాలింత మరణాలు సంభవిస్తాయి. అరుదైన రక్తగ్రూపు ఉన్న వారిలో ఈ శాతం ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత రాష్ట్ర సరాసరి 68 % ఉంటే కామారెడ్డి జిల్లాలో 78%గా ఉంది. దీన్ని ప్రారంభంలోనే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేక ఫలితాలు కనిపించడం లేదు. గర్భం దాల్చిన 12వారాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆశా వర్కర్ తీసుకెళ్తారు. అన్ని పరీక్షల అనంతరం ఎనీమియా సమస్య ఉంటే ఐరన్ మాత్రలు ఇస్తారు. గర్భిణీలు ఈ మాత్రలు వేసుకుంటే తర్వాతి పరీక్షల కోసం వచ్చినప్పుడు సమస్య తీరిపోవాలి. కానీ అది జరగడం లేదు.

యోగా చేయాలి.. పనులు చేయాలి..

సాధారణ ప్రసవాలు పెరగాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం చాలా అవసరమని వైద్యులు అంటున్నారు. పిల్లలను సుకుమారంగా పెంచడం వల్ల పెళ్లి అయ్యాక గర్భిణీగా పురిటి నొప్పులు భరించలేకపోతున్నారు. అలాగే గర్భం దాల్చినప్పటి నుంచే కుటుంబ సభ్యులు ఏ పనీ చెయ్యనివ్వడం లేదు. దీనివల్ల సాధారణ ప్రసవానికి అవకాశం లేకుండా పోతోంది. తొమ్మిదో నెల వరకూ చిన్న చిన్న ఇంటి పనులు చేసుకోవడం, గర్భిణీ చేయదగ్గ యోగాసనాలు వేయాలని వైద్యులు సూచిస్తున్నారు. తద్వారా సాధారణ ప్రసవానికి అవకాశాలు మెరుగవుతాయని చెబుతున్నారు.

పాత కాలం మళ్లీ రావాలి..

ఇప్పుడంటే సిజేరియన్లు చేసుకుంటున్నారు కానీ పూర్వం అంతా సాధారణ ప్రసవాలే. అందుకే.. ఆ కాలం మనుషులు అంత ఆరోగ్యంగా ఉన్నారు. దీనిని గుర్తించి.. సాధారణ ప్రసవాల పై అవగాహన పెంచాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. సాధారణ ప్రసవం వల్ల తల్లి, బిడ్డకు కలిగే ప్రయోజనాలు ప్రజలు అర్థం చేసుకుంటేనే.. సత్ఫలితాలు వస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details