తెలంగాణ

telangana

ETV Bharat / state

అరుదైన ఆపరేషన్​లతో జీజీహెచ్​ అద్భుతాలు.. పేదలకు ఫ్రీగా కార్పొరేట్​ సేవలు - rare operations in Nizamabad GGH

Nizamabad GGH Wonders: ప్రభుత్వ ఆస్పత్రులు పేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నాయి. సాధారణ సేవలకే పరిమితం కాకుండా ప్రైవేటులో లక్షలు ఖర్చయ్యే అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలు కాపాడుతున్నాయి. ప్రసూతి, ఈఎన్​టీ, ఎముకల విభాగాల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారు. జిల్లా ఆసుపత్రుల్లోనూ మోకీలు వంటి శస్త్ర చికిత్స చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆపరేషన్లు జరుగుతున్నాయి.

Nizamabad GGH works wonders with rare operations and giving corporate level treatment to poor
Nizamabad GGH works wonders with rare operations and giving corporate level treatment to poor

By

Published : May 29, 2022, 9:35 PM IST

అరుదైన ఆపరేషన్​లతో జీజీహెచ్​ అద్భుతాలు.. పేదలకు ఫ్రీగా కార్పొరేట్​ సేవలు..

Nizamabad GGH wonders: సర్కారు ఆస్పత్రి అనగానే సాదాసీదా వైద్యం, ఉండీలేని వసతులు.. అరకొర మందులు, వైద్యులు, సిబ్బంది ఖాళీలు.... ఎప్పుడూ వీటి గురించే వింటాం. కానీ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇందుకు భిన్నంగా ముందుకు సాగుతోంది. కార్పొరేట్‌కు సమాన స్థాయిలో వైద్య సేవలు అందిస్తోంది. ఉన్నంతలో సిబ్బంది, వైద్యులతోనే అద్భుతాలు చేస్తోంది. కార్పొరేట్‌లో లక్షల రూపాయలు వెచ్చించాల్సిన సర్జరీలను సైతం ఉచితంగా చేస్తూ పేదల పాలిట పెన్నిదిలా నిలబడుతోంది. మోకీలు మార్పిడిలు, కంటి మోతె బిందు సర్జరీలు, క్యాన్సర్ చికిత్సలు, ప్రసూతి విభాగంలో అత్యంత క్లిష్టమైన కేసులకు సైతం చికిత్స అందించడంతో రోగుల్లో నమ్మకం పొందుతోంది. అరుదైన చికిత్సలతో ప్రజలకు సర్కారు ఆస్పత్రిపై దీమా కల్పిస్తోంది.

జీజీహెచ్ మంచి గుర్తింపు: కరోనా కాలం నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాలు పెరుగుతూ వచ్చాయి. అధునాతన చికిత్స యంత్రాలు, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉండటంతో.... సర్కారు ఆదేశాల కంటే ముందే అరుదైన శస్త్ర చికిత్సలు చేయడం ప్రారంభించారు. కరోనా నుంచి అత్యాధునిక పరికరాలు సీయామ్, ఆధునిక వెంటిలేటర్లు, సీపాప్ యంత్రాలు, ఈసీజీ, 2డీఎకో వంటి యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్.. ఉన్న వసతులను సద్వినియోగం చేస్తూ నిపుణులైన వైద్యులతో అరుదైన శస్త్ర చికిత్సలు చేయించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జీజీహెచ్​ నిజామాబాద్‌కు మంచి గుర్తింపు లభించింది. ప్రభుత్వ ఆదేశాల్లో భాగంగా ముగ్గురు మహిళలకు మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేయగా... వారంతా కోలుకుని నడుస్తున్నారని సూపరింటెండెంట్‌ డాక్టర్ ప్రతిమారాజ్‌ తెలిపారు.

మోకీలు మార్పిడి: గత నెల రోజుల్లో ఐదుగురికి నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేశారు. ప్రైవేటులో ఒక్కొక్కరికి రూ. 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చయ్యేది. కానీ జీజీహెచ్​లో ఉచితంగా సర్జరీలు చేశారు. ప్రైవేటులో చేయించలేక.. మోకాళ్ల నొప్పులను భరించలేక ఏళ్లుగా సతమతమైన రోగులు ఇన్నాళ్లకు ఉపశమనం పొందారు. కోటగిరి మండలానికి చెందిన రమేష్​కు ట్రాక్టర్ బోల్తా పడ్డ ఘటనలో నడుము విరిగిపోయి మంచానికి పరిమితం కాగా... శస్త్ర చికిత్స చేసి అతన్ని కాపాడారు.

అరుదైన చికిత్సలు: నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి గతంలో అగ్నిప్రమాదంలో గాయపడగా.. మోచేతి వద్ద గడ్డగా ఏర్పడి అది క్యాన్సర్‌గా తేలింది. ఇది లక్షల్లో ఒకరికి అరుదుగా వస్తుంది. దీనికి జీజీహెచ్​లో చికిత్స చేశారు. నిజాంసాగర్‌కు చెందిన సవిత అనే బాలిక గొంతు భాగంలో వచ్చే ప్యారా థైరాయిడ్ కార్సినోమా క్యాన్సర్‌తో బాధ పడుతుంటే... చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఇటీవల నిజాంసాగర్‌ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి... పేగులు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. జనరల్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో మూడు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేశారు. ఇటీవల ఓ మహిళకు ప్రసవ సమయంలో బిడ్డతో పాటు గర్భ సంచీ బయటకు రాగా... శస్త్రచికిత్స చేసి ఆమెకు ప్రమాదం లేకుండా చూశారు. కొవిడ్​తో బాధపడుతున్న గర్భిణీకి ముగ్గురు చిన్నారులు జన్మించగా... వారు కరోనా బారిన పడకుండా చూశారు.

జిల్లా ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జీజీహెచ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. కంటి, ఆర్థో విభాగం ఆధ్వర్యంలో సర్జరీ అవసరమైన వారిని గుర్తించారు. వారికి ఆస్పత్రిలో మరోసారి స్క్రీనింగ్ చేసి తీవ్రత ఆధారంగా వారానికి కనీసం ఇద్దరికి శస్త్రచికిత్సలు చేయనున్నారు. జీజీహెచ్ నిజామాబాద్‌పై క్రమం రోగుల్లో నమ్మకం పెరుగుతోంది. వైద్యం, సౌకర్యాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details